తప్పు చేయనంటూనే రవిశాస్త్రికి గంగూలీ షాక్
మూంబై: టీమిండియా కోచ్గా గ్రెగ్ చాపెల్ను సిఫార్సు చేసి తాను తప్పు చేశానని, అలాంటి తప్పు మరోసారి చేయనంటూనే సౌరవ్ గంగూలీ చక్రం తిప్పారు. రవిశాస్త్రికి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్, టీమిండియా కెప్టెన్ గంగూలీ పెద్ద షాకే ఇచ్చారు. రవిశాస్త్రి కాకుండా అనిల్ కుంబ్లే టీమిండియా హెడ్ కోచ్గా నియమితులు కావడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు ప్రచారం సాగుతోంది.
భారత మాజీ న్యాయమూర్తి ఆర్ఎం లోథా కూడా తెర వెనక చక్రం తిప్పినట్లు చెబుతున్నారు. నిజానికి గతంలో టీమిండియా కోచ్గా ఇన్నింగ్సు ప్రారంభించాలని గంగూలీ భావించారు. కానీ ఆ పదవిని రవిశాస్త్రి తన్నుకుపోయారు. దాంతోనే రెండో సారి ఆ పదవి శాస్త్రికి దక్కకుండా గంగూలీ కథ నడిపినట్లు చెబుతున్నారు.
కాగా, సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి నేతృత్వం వహించిన లోథా బిసిసిఐలో సమూలమైన మార్పులు రావాలని సూచించారు. ఆయన కూడా కుంబ్లే హెడ్ కోచ్గా నియమితులు కావడంలో పరోక్ష పాత్ర నిర్వహించినట్లు చెబుతున్నారు.
ఆటగాళ్ల సంఘాన్ని ఏర్పాటు చేసి అందులో కుంబ్లేను సభ్యుడిగా చేయాలని లోథా సూచించారు. కుంబ్లేను హెడ్ కోచ్గా నియమించడం ద్వారా బిసిసిఐ ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టిందని భావిస్తున్నారు. ఒకటి కుంబ్లేను ఆటగాళ్ల సంఘంలో సభ్యుడిగా లేకుండా చేయడం, రెండోది ఆ సంఘం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోకుండా చూడడం.