గొట్టిపాటి పైచేయి: బాబు వద్ద కరణం మాట చెల్లుబాటు కావట్లేదా?
అమరావతి: అధికార పార్టీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా వైసీపీ నుంచి టీడీపీలోకి 20 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో కొంత మంది అధికార పార్టీ నేతలతో సర్దుకుపోతే మరికొంద మంది ఎమ్మెల్యేలు మాత్రం సర్దుపోకుండా అధికార పార్టీకి తలనొప్పి తెస్తూనే ఉన్నారు.
అలాంటి నియోజకవర్గాల్లో ప్రకాశం జిల్లాలోని అద్దంకి నియోజక వర్గం ఒకటి. అద్దంకి నియోజక వర్గం నుంచి వైసీపీ టికెట్పై గెలిచిన గొట్టిపాటి రవికుమార్ చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేరారు. అయితే గొట్టిపాటి రాకను వ్యతిరేకించిన మొదటి నుంచి కరణం బలరాంతో సహా ఆయన వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు.
దీంతో ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య ఏదో ఒక అంశంపై ఎప్పుడూ ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం గొట్టిపాటి రవికుమార్, టీడీపీ సీనియర్ నేత కరణం బలరాంలు ఎవరి వారు ఎత్తుకుపైఎత్తులు వేస్తూనే ఉన్నారు.
తాజాగా ఈ ఆధిపత్య పోరులో కరణం బలరాంపై ఇటీవల పార్టీలో చేరిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పైచేయి సాధించారు. ముందుగా అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్ వ్యవహారంలో, ఆ తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టు ఎస్ఈ రమణమూర్తి బదిలీ వ్యవహారంలోనూ మాట నెగ్గించుకొని కరణం బలరాం పైచేయి సాధించారు.
అయితే పట్టుమని పది రోజులు కూడా తిరగక్కుండానే గొట్టిపాటి రవికుమార్, కరణం బలరాంను దెబ్బతీశారు. ముఖ్యంగా అద్దంకి సీఐ వ్యవహారంలో కరణం బలరాంకు భంగపాటు తప్పలేదు. జూన్ 13వ తేదీన కరణం బలరాంకు అనుకూలంగా ముద్ర వేసుకున్న అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్ను కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పట్టుపట్టి బదిలీ చేయించిన సంగతి తెలిసిందే.
ఆయన స్ధానంలో గుంటూరు వీఆర్లో ఉన్న హైమారావుకు అద్దంకికి బదిలీ చేయించారు. ఈ మేరకు డీఐజీ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అయితే విషయం తెలుసుకున్న కరణం బలరాం హుటాహుటిన పావులు కదిపి ఐజీతో పాటు ఏకంగా డీజీపీ పైనే ఒత్తిడి తీసుకొచ్చి అదే రోజు సాయంత్రానికి సీఐ బేతపూడి ప్రసాద్ బదిలీని నిలిపేయించారు.
దీంతో ఇద్దరి మధ్య వర్గ విభేదాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరేటప్పుడే సీఐ బదిలీ ప్రధాన డిమాండ్గా చెప్పానని, ఇప్పుడు అది కూడా చేయకపోతే తాను పార్టీలో ఉండటం ఎందుకంటూ గొట్టిపాటి రవికుమార్ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వద్ద వాపోయినట్లు సమాచారం.
దీంతో గొట్టిపాటికే ప్రాధాన్యత ఇస్తూ మంగళవారం జరిగిన సీఐల బదిలీల్లో అద్దంకి సీఐ బేతపూడి ప్రసాద్ను బదిలీ చేసి ఆయన స్థానంలో గతంలో గొట్టిపాటి ప్రతిపాదించిన హైమారావునే నియమిస్తూ డీఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కరణం బలరాం అగ్గిమీద గుగ్గిలమయ్యారని తెలుస్తోంది.
ప్రకాశం జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరణంకు కాకుండా గొట్టిపాటి రవికుమార్కే ప్రాధాన్యతనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సీఐ బదిలీ వ్యవహారంలో రవికుమార్కే అనుకూలంగా వ్యవహరించడంతో కరణంకు భంగపాటు తప్పలేదు.