జీఎస్టీ: బిజెపికి చిక్కని రేఖ, సచిన్ కూడా.. కానీ!
న్యూఢిల్లీ: చాలా కాలంగా ఆమోదం కోసం ఎదురుచూసిన జీఎస్టీ బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే, బిల్లుకు అందరి ఆమోదం కోసం తాపత్రయపడిన కేంద్ర ప్రభుత్వం నామినేటెడ్ సభ్యురాలు రేఖ ఆచూకీ కోసం కూడా ఎంతగానో ప్రయత్నించింది.
తాము మైనారిటీగా ఉన్న రాజ్యసభలో వివిధ పార్టీలను సంప్రదించిన బిజెపి నేతలు.. క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ నటి రేఖ వంటి నామినేటెడ్ సభ్యుల కోసం కూడా దృష్టి సారించారు. రేఖను ఎలా సంప్రదించాలో సూచించాల్సిందిగా సీనియర్ మంత్రులు కాంగ్రెస్ నేతలను అభ్యర్థించారు.
వీరిద్దరు కూడా యూపీఏ ప్రభుత్వ హయాంలో నియమితులైన విషయం తెలిసిందే. కాగా, గత నాలుగేళ్లుగా వారు పార్లమెంటుకు చాలా అరుదుగా మాత్రమే హాజరవుతున్నారు. కనీసం జీఎస్టీ బిల్లు ఆమోదం సమయంలోనైనా ఉంటారనుకుంటే.. అది కూడా జరగలేదు. అయితే, రేఖ తొలిసారి ఈసారి బడ్జెట్ సమావేశాలకు హాజరవడం గమనార్హం.
One nation one tax, making #GST a reality is just a matter of time! Look forward to #GST delivering the benefits.
— sachin tendulkar (@sachin_rt) 2 August 2016
రాజ్యసభ జీఎస్టీ గురించి చర్చించినప్పుడు సచిన్ కూడా హాజరుకాలేదు. కానీ, ట్విట్టర్లో మాత్రం బిల్లుకు మద్దతు తెలిపారు. 'ఒక దేశం ఒక పన్ను విధానం అమలులోకి వచ్చే జీఎస్టీ వాస్తవం కానుంది. ఇప్పుడది కొంత సమయం తీసుకునే విషయం మాత్రమే. జీఎస్టీ అందించే ప్రయోజనాలకోసం ఎదురుచూడండి' అంటూ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.