తిట్టి సారీ చెప్పిన భజ్జీ, కోపంతో వెళ్లిపోయిన రాయుడు (వీడియో)
పుణే: ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు హర్భజన్ సింగ్ - అంబటి రాయుడులు ఆదివారం నాడు గొడవ పడ్డారు. పుణే ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఈ సంఘటన జరిగింది. హర్భజన్ సింగ్ బౌలింగులో సౌరభ్ తివారీ బౌండరీ సాధించాడు.
లాంగాన్లో ఈ బంతిని ఆపేందుకు డీప్ మిడ్ వికెట్ నుంచి అంబటి రాయుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. డైవ్ చేసినా ఫలితం లేకుండా పోయింది. బంతిని ఆపలేకపోయాడు. దీంతో రాయుడు పైన హర్భజన్ సింగ్ నోరు పారేసుకున్నాడు.
అక్కడే ఉన్న సౌథీ పట్టుకోవాల్సిన బంతి కోసం నువ్వు ఎందుకు వచ్చావన్నట్లుగా అతనిని తిట్టాడు. రాయుడు వైపు ఆగ్రహంగా చూస్తూ తిట్టాడు. దీంతో అంబటి రాయుడికి ఒళ్లు మండిపోయింది. ఎందుకలా తిడుతున్నావ్ అని కోపంగా ప్రశ్నించి, భజ్జీ వైపు దూసుకు వచ్చాడు.
దీంతో హర్భజన్ సింగ్ కొంత తగ్గాడు. దగ్గరికి వెళ్లి క్షమాపణ చెప్పినట్లుగా తెలుస్తోంది. రాయుడు కోపం తగ్గించే ప్రయత్నం చేశాడు. కానీ రాయుడు మాత్రం అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయాడు. రాయుడు శాంతించలేదు. భజ్జీ చేతిని కోపంగా విదిలించుకుంటూ వెళ్లిపోయాడు.
అయితే, ఆ తర్వాత 13వ ఓవర్లో హాండ్స్ కోంబ్ను అవుట్ చేసిన భజ్జీని అంబటి రాయుడు అభినందించాడు. దీంతో వారి మధ్య వాతావరణం చల్లబడినట్లుగా కనిపించింది. గతంలో హైదరాబాద్ జట్టుకు ఆడినప్పుడు అర్జున్ యాదవ్తో అంబటి రాయుడు మైదానంలో ఘర్షణ పడ్డాడు.య ఐపీఎల్ తొలి సీజన్లో శ్రీశాంత్ను భజ్జీ చెంప దెబ్బ కొట్టిన విషయం తెలిసిందే.
పుణేపై ముంబై గెలుపు
కాగా, కెప్టెన్ రోహిత్ శర్మ మెరిసిన వేళ ఆదివారం ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ను చిత్తుగా ఓడించింది.
స్మిత్ (23 బంతుల్లో 45), సౌరభ్ తివారి (45 బంతుల్లో 57) మెరవడంతో మొదట పుణె బలమైన పునాది వేసుకునప్పటికీ.. ముంబై బౌలర్లు ఆ జట్టును 159/5కే పరిమితం చేశారు. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రోహిత్ (60 బంతుల్లో 85 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్తో లక్ష్యాన్ని ముంబై 18.3 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి అలవోకగా ఛేదించింది.