విరాట్ కోహ్లీపై ఆస్ట్రేలియా కుట్ర చేసినా...
హైదరాబాద్: ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచులో భారత జట్టును దెబ్బ తీయడానికి ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ను ఆసీస్ పావుగా వాడుకున్నట్లు కనిపిస్తోంది. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ కోహ్లీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఆసీస్ ప్రయత్నించిందనే విమర్శ వచ్చింది.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన ఆసీస్ బౌలర్ మిచెల్ జాన్సన్ ట్వీట్స్ కోహ్లీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో టాప్ 5 బ్యాట్స్మెన్స్ అంటూ ధోనీ, ఏబీ డివిలియర్స్, స్మిత్, రూట్, విలియమ్సన్ పేర్లను ప్రకటిస్తూ జాన్సన్ ఓ ట్వీట్ పెట్టాడు.
ఫోటో గ్యాలేరి: వరల్డ్T20
ఆ ట్వీట్పై కోహ్లీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా చేయడం ద్వారా విరాట్ కోహ్లీ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీసి క్వార్టర్ ఫైనల్ మ్యాచులో భారత్ను దెబ్బ తీయడానికి ఆస్ట్రేలియా జాన్సన్ను వాడుకున్నట్లు అనుమానిస్తున్నారు.
అద్భుతమైన ఫామ్లో ఉన్న కోహ్లీని జాన్సన్ ప్రస్తావించకపోవడం ఏమిటని భారత క్రికెట్ అభిమానులు ప్రశ్నించారు. ఈ ట్వీట్లపై మీడియా కోహ్లీని ప్రశ్నించగా.. ఈ విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఇదసలు పెద్ద విషయమే కాదని చెప్పాడు. ఆసీస్తో తాను ఆడిన ప్రతీ మ్యాచ్ నుంచి ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉన్నానని తెలిపాడు.
జాన్సన్ కూడా కోహ్లీ పేరు చేర్చకపోవడంపై వివరణ ఇచ్చాడు. నిరుడు జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో కోహ్లీ ఫెయిలయ్యాడని, అందుకే చేర్చలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాపై మ్యాచులో అద్భుతమైన ఆటను ప్రదర్శించి ఇండియాను గెలిపించాడు. ఆస్ట్రేలియా పాచిక పారలేదు.