బ్లాక్మనీ లీక్: 500మందిలో ఐశ్వర్య, బిగ్ బీ, అనురాగ్ కేజ్రీవాల్!
న్యూఢిల్లీ: నల్లధనం విషయంలో షాకింగ్ వార్త ఒకటి మీడియాలో చర్చనీయాంశమవుతోంది. బ్లాక్ మనీ దాచుకున్న వారి వివరాల్లో 500 మంది భారతీయుల పేర్లు ఉండటం కుదిపేస్తోంది.
గత నలభై ఏళ్లుకు చెందిన దాదాపు 11 మిలియన్ల పత్రాలను పరిశీలించి జర్మనీ పత్రిక 'సుడియుషె జీతంగ్'లో వెల్లడైన 'పనామా పేపర్స్' వివరాల ప్రకారం.. బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్లతో పాటు డీఎల్ఎఫ్ యజమాని కేపీ సింగ్, ఆయన తొమ్మిది మంది కుటుంబ సభ్యులు, గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ, అపోలో టైర్స్, ఇండియా బుల్స్ ప్రమోటర్ల పేర్లు కూడా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్కు చెందిన రాజకీయ నాయకుడు శిశిర్ బజోరియా, లోక్సత్తా ఢిల్లీ విభాగం మాజీ చీఫ్ అనురాగ్ కేజ్రీవాల్, ముంబై గ్యాంగ్ స్టర్ ఇక్బాల్ మిర్చి (ప్రస్తుతం మరణించాడు)లు ఉన్నారు. ఐశ్వర్య రాయ్, ఆమె తల్లిదండ్రులు, సోదరులు బ్రిటన్లో 2005లో రిజిస్టరైన అమిక్ పార్ట్ నర్స్ లిమిటెడ్లో డైరెక్టర్లని, ఆ సంస్థ ద్వారా బ్లాక్ మనీని నిర్వహించారని పేర్కొంది.
బిగ్ బీ నాలుగు విదేశీ సంస్థల్లో డైరెక్టర్గా ఉన్నారని ఈ కంపెనీలు ఐదువేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల మూలధనం నిల్వలను కలిగినప్పటికీ, మిలియన్ల విలువైన డీల్స్ చేశాయని పేర్కొంది. భారత్లో జరిగే ఎన్నో క్రికెట్ డీల్స్లో అవకతవకలు జరుగుతున్నాయని, ఆర్బీఐ నిబంధనలు ఇందుకు సహకరిస్తున్నాయని 'పనామా పేపర్స్' అభిప్రాయపడింది.
కాగా, 76 దేశాలకు చెందిన 375 మంది జర్నలిస్టుల బృందం 'పనామా పేపర్స్' ప్రాజెక్టులో భాగస్వామ్యమై ప్రపంచ వ్యాప్తంగా నల్లధనం దాచుకున్న వారి వివరాలను వెల్లడించే దిశగా పరిశోధనలు సాగించింది. ఇప్పుడా వివరాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ టీంలో మన దేశంలోని 'ఇండియన్ ఎక్స్ ప్రెస్' దినపత్రిక భాగమైంది.