పావురాలతో పాక్ గూఢచర్యం: 153 పావురాల అరెస్ట్
న్యూఢిల్లీ: భారత సైనిక రహస్యాలను పాకిస్తాన్కు చేరవేసేందుకు పంపిన 153 పావురాలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరటిపండ్లు తరలించే డబ్బాల్లో 150కిపైగా పావురాలను తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను జంతు సంరక్షణ చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు.
ఈ పావురాలను సేవ్ (జంతువులను రక్షించండి.. పర్యావరణాన్ని కాపాడండి) అనే స్వచ్ఛందసంస్థ తరలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వాటి కాళ్లకు అయస్కాంతం రింగులు తొడిగి ఉన్నాయని, వీటికి సందేశాలు చుట్టి పంపించే అవకాశం ఉన్నదని విచారణాధికారులు అనుమానిస్తున్నారు.
ఆ పావురాలను పంజాబ్ సరిహద్దుల నుంచి దక్షిణ కాశ్మీర్లోని సున్నితమైన పుల్వామా జిల్లాకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. పావురాలకు సంబంధించిన కేసును పోలీసులు సిఐడికి అప్పగించారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టగా, వారు జరిమానా చెల్లించారు
పావురాలను పాకిస్తాన్కు రహస్య సమాచారం చేరవేయడానికి వాడుతున్నట్లు తమకు సమాచారం అందిందని జమ్మూ జిసి సిమ్రాన్ దీప్ సింగ్ పిటిఐ వార్తాసంస్థతో చెప్పారు. పావురాలకు ప్రత్యేకమైన రంగు ఎందుకు వేశారనే కోణంలో కూడా సిఐడి అధికారులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. పావురాలకు వివిధ రకాల రంగులు గల రింగులను తొడిగినట్లు తెలిపారు.