'రాహుల్గాంధీ దేశద్రోహి, ఉరేయాలి లేదా కాల్చేయాలి'
ఢిల్లీ: జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యు)లో వివాదం రోజు రోజుకు ముదురుతోంది. తీవ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా సభ నిర్వహించిన నేపథ్యంలో కేసు పెట్టి పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే, తమ పైన చర్యలు తీసుకోవడాన్ని నిరసిస్తూ కొందరు విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు.
వారికి ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, వామపక్షాలు మద్దతుగా నిలిస్తున్నాయి. దీంతో వారిపై బిజెపి, మాజీ సైనికులు మండిపడుతున్నారు. అఫ్జల్ గురుకు మద్దతుగా సభ నిర్వహంచడం, వారికి రాహుల్ వంటి వారు మద్దతు పలకడంపై బిజెపి దుయ్యబడుతోంది.
తాజాగా, రాజస్థాన్ బిజెపి ఎమ్మెల్యే కైలాష్ చౌదరి... రాహుల్ గాంధీ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని దేశ ద్రోహిగా అభివర్ణించారు. కాంగ్రెస్ యువ నేతను ఉరేయాలని డిమాండ్ చేశారు. లేదంటే కాల్చిపారేయాలన్నారు.
రాజస్థాన్లోని బార్మర్ జిల్లా బైతూ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కైలాష్ చౌదరి ఉన్నారు. బుధవారం నాడు తన సొంత రాష్ట్రంలో జరిగిన రైతు సమ్మేళన్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాహుల్ గాంధీ తీరును దుయ్యబట్టారు.
జేఎన్యూ ఘటనలో అఫ్జల్ గురుకు అనుకూలంగా ర్యాలీ తీసిన విద్యార్థులకు సంఘీభావంగా రాహుల్ మాట్లాడటం ముమ్మాటికీ దేశ ద్రోహమేనన్నారు. దేశానికి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాలకు మద్దతు తెలిపే వ్యక్తులు... రాహుల్ గాంధీ అయినా, మరొకరైనా దేశ ద్రోహులేనని తేల్చిచెప్పారు.
అలాంటి దేశ ద్రోహులను ఉరి తీయాలి లేదా కాల్చి పారేయాలన్నారు. రైతు సమ్మేళన్లో తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఆయన చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. జెఎన్యులో ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా సభ నిర్వహించడాన్ని చాలామంది తప్పుపడుతున్నారు.