నా భార్యా, పిల్లలకు ఆ పేరే: వివాదంలోకి తలదూర్చిన కన్నయ్య
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ (జెఎన్యు) విద్యార్థి కన్నయ్య కుమార్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తన భార్యా, పిల్లలకు భారత్ మాతాకీ జై అని పేరు పెడతానని, తన పేరు కూడా అలాగే పెట్టుకుంటానని ఎద్దేవా చేశారు.
ఇటీవల భారత్ మాతాకీ జై పైన జోరుగా చర్చ సాగుతోన్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ భారత్ మాతాకీ జై అనాలని బిజెపి, ఆరెస్సెస్ చెబుతుండగా, ఒత్తిడి సరికాదని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. అయితే, భారత్ మాతాకీ జై అని తాము అంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
భారత్ మాతాకీ జై పైన ఓ వైపు చర్చ జరుగుతుండగా... కన్నయ్య కుమార్ తనంత తానుగా ఈ వివాదంలో తలదూర్చాడు. ఆయన శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వాళ్లు దేశమే సర్వస్వం అంటున్నారని, భారత్ మాతా కీ జై అని తీరాల్సిందే అని హెచ్చరిస్తున్నారని, అందుకే తనకు పెళ్లయ్యాక నా భార్యకు భారత్ మాతా కీ జై అని పేరు పెట్టాలనుకుంటున్నానని, నా పిల్లలకు కూడా అదే పేరు పెడతానని, తన పేరునూ భారత్ మాతా కీ జై అని మార్చుకుంటానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు.
తన పిల్లలు బడికెళ్లినపుడు ఉపాధ్యాయులు మీ తల్లిదండ్రుల పేర్లేంటని అడుగుతారని, వాళ్లు భారత్ మాతా కీ జై అంటారని, ఇంకేముంది, పిల్లలు ఉచితంగా విద్య పొందుతారని, ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించాడు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.