జయలలిత గెలుపు, కరుణానిధి కొడుకు సంబరాలు!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే తిరిగి అధికారం చేపట్టడం ఆ పార్టీ వర్గాల్లో ఆనందం వెల్లువిరుస్తోంది. అయితే, ప్రతిపక్ష నేత కరుణానిధి తనయుడు అళగిరి కూడా సంబరాలు చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వారసత్వ పోరులో ఓడిన అళగిరి.. జయ గెలవడంతో సంబరాలు చేసుకున్నారంటున్నారు. అంటే డీఎంకే ఓడినందుకు ఆయన సంబరాలు చేసుకున్నారు.
తమిళనాడులో డీఎంకే ఓటమికి కరుణానిధి కుటుంబంలోని కలహాలు కూడా కారణం. రుణమాఫీ, మద్య నిషేధం గురితప్పడం, శిష్యుడు వైగో కరుణను ఓడించేందుకు కంకణం కట్టుకోవడం, జయలలిత పథకాలతో పాటు అన్నదమ్ములు... అళగిరి - స్టాలిన్ల గొడవ కూడా పార్టీ కొంప ముంచింది.
కొడుకుల ఎత్తుపైఎత్తు: కరుణకు 'సన్' స్ట్రోక్, అదే ఊరట
తన వారసుడిగా పార్టీలో చిన్న కొడుకు స్టాలిన్ను ప్రకటించడాన్ని పెద్ద కొడుకు అళగిరి జీర్ణించుకోలేకపోయారు. వ్యూహాత్మకంగా కరుణానిధి అళగిరిని మధురకు పంపించారు. అక్కడి పార్టీ కార్యకలాపాల పైన దృష్టి సారించమని చెప్పారు. అయితే, స్టాలిన్కు ప్రాధాన్యం ఇవ్వడాన్ని అళగిరి జీర్ణించుకోలేకపోయారు.
చివరకు అళగిరిని పార్టీ నుంచి సస్పెండ్ చేయవలసి వచ్చింది. ఎన్నికల నేపథ్యంలో అళగిరిని కరుణానిధి తన వద్దకు రప్పించుకున్నారు. కానీ అది ఫలించలేదు. ఎన్నికల్లో గెలిస్తే కరుణానిధియే ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించినప్పటికీ.. డీఎంకే అధికారంలోకి వస్తే ఒకటి రెండేళ్లు కరుణ ఉన్నప్పటికీ.. ఆ తర్వాత స్టాలిన్ను కూర్చోబెడతారని అళగిరి భావించారు.
ఈ నేపథ్యంలో డీఎంకేను ఓడించాలని ఆయన కంకణం కట్టుకున్నారు. అళగిరికి దక్షిణాది జిల్లాల పైన మంచి పట్టు ఉంది. మధురై పరిసర ప్రాంతాల్లో మంచి పట్టు ఉంది. ఒకప్పుడు ఇది అన్నాడీఎంకేకు కంచుకోట.య దానిని అళగిరి డీఎంకేకు అనుకూలంగా మార్చారు.
ఇప్పుడు వారసుడిగా స్టాలిన్ను సహించని అళగిరి.. తనకు పట్టున్న దక్షిణాది జిల్లాల్లో పరోక్షంగా అన్నాడీఎంకేకు అనుకూలగా పని చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. మధురై, తిరునల్వేలి, తేని, దిండిగల్, విరుద్ నగర్ జిల్లాల్లో 56 స్థానాల్లో అన్నాడీఎంకే గెలవడం ఇందుకు నిదర్శనం అంటున్నారు.
ఓట్లు కొల్లగొట్టిన డీఎంకే
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య పోరు హోరాహోరీగానే సాగింది. విపక్ష డీఎంకేపై స్వల్ప తేడాతో అధిక ఓట్లు సాధించిన అన్నాడీఎంకే తిరిగి తన అధికారాన్ని నిలుపుకుంది. సీట్ల సంఖ్యలో ఈ రెండు పార్టీల మధ్య భారీ తేడా ఉన్నా ఆ పార్టీలకు పోలైన ఓట్ల శాతంలో తేదా మాత్రం కేవలం 1.5 శాతమే.
జయలలిత ఆధ్వర్యంలో అన్నాడీఎంకే 134 సీట్లలో గెలిచి విజయం సాధించగా, 98 సీట్లతో సరిపెట్టుకున్న డీఎంకే - కాంగ్రెస్ కూటమి మాత్రం వరుసగా రెండో దఫా ప్రతిపక్ష స్థానంలో కూర్చోనుంది. ఈ రెండు పార్టీలకు లభించిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే...అన్నాడీఎంకేకు 40.8 శాతం ఓట్లు వచ్చాయి.
డీఎంకే కూటమికి కూడా అన్నాడీఎంకేకు పోలైన ఓట్ల శాతానికి దరిదాపుల్లో 39.3 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే ఈ రెండు పార్టీల మధ్య తేడా కేవలం 1.5 శాతమే. డీఎంకే కూటమికి వచ్చిన ఓట్లలో డీఎంకేకు 31.6 శాతం, కాంగ్రెస్ కు 6.5 శాతం, ఐయూఎంఎల్ కు 0.7 శాతం, పుదియ తమిళగం పార్టీకి 0.5 శాతం ఓట్లు వచ్చాయి.