ఆనందీబెన్కు గవర్నర్ గిరి?: రోశయ్య కోసం జయ మంతనాలు!
హైదరాబాద్: తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య పదవీ కాలం ఆగస్టు నెలతో ముగియనున్న నేపథ్యంలో ఆయన పదవీ కాలాన్ని పొడగిస్తారా? లేక ఆయనను తొలగించి మరెవరినైనా ఆ పదవిలో కూర్చోబెడతారా? అనే అంశంపై చర్చ జరుగుతోంది. అయితే, తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆనందీ బెన్ను తమిళనాడు గవర్నర్గా నియమిస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
రోశయ్య పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుండటంతో ఆయనకు పొడిగింపు ఇవ్వాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. ప్రధాని నరేంద్ర మోడీని కోరారన్న ప్రచారం కూడా జరుగుతోంది. రోశయ్య గవర్నర్గా వచ్చిన తర్వాత జయలలితతో పరిపాలన పరమైన సహకారం కొనసాగించారు.
ఆమె కూడా గవర్నర్ స్థానంలో ఉన్న రోశయ్యకు సముచిత గౌరవం ఇవ్వడంతోపాటు ముఖ్యమైన అంశాలపై రాజకీయ సలహాలు తీసుకునేవారని ప్రచారంలో ఉంది. ఈ క్రమంలో ఆగస్టు నెలాఖరకు పదవీ విరమణ చేయనున్న రోశయ్య పదవీకాలం పొడిగించాలని ఆమె ప్రధానిని కోరినట్లు తమిళ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అయితే, బిజెపి వర్గాలు మాత్రం తమిళనాడు గవర్నర్ పదవి, ఇటీవల గుజరాత్ సీఎం పదవిని త్యాగం చేసిన ఆనందీబెన్ను వరించవచ్చని చెబుతున్నాయి. కాగా, ఆమెను పంజాబ్ గవర్నర్గా నియమించే అవకాశాలు కూడా ఉన్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది.
ఈ నేథ్యంలో ఒకవేళ ఆమె కాకున్నా, పార్టీలో చాలామంది సీనియర్లు పదవుల కోసం ఎదురుచూస్తున్నందున, వారిలో ఎవరినైనా ఒకరిని తమిళనాడు గవర్నర్ పదవి వరించే అవకాశాలున్నాయని అంటున్నారు.