ఏడ్చిన లక్ష్మీదేవమ్మ: జెసి-పరిటాలని గుర్తుచేసిన బాబు
విజయవాడ: జమ్మలమడుగు శాసన సభ్యుడు ఆదినారాయణ రెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవడంపై ఆ పార్టీ సీనియర్ నేత రామసుబ్బా రెడ్డి పెద్దమ్మ లక్ష్మీదేవమ్మ కంటతడి పెట్టారు. ఆమెను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఊరడించారు. అన్ని రకాలుగా ధైర్యం చెప్పారు.
ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, జలీల్ ఖాన్, ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి సోమవారం రాత్రి సైకిల్ ఎక్కిన విషయం తెలిసిందే. ఈ సమయంలో అందరికీ సర్ది చెప్పేందుకు చంద్రబాబు చేరుతున్న ఎమ్మెల్యేల నియోజకవర్గాల టిడిపి నేతలు, జిల్లా నేతలను పిలిపించారు. వారితో మాట్లాడారు.
అందులో భాగంగా ఆదినారాయణ రెడ్డి చేరిక నేపథ్యంలో జమ్మలమడుగు నియోజకవర్గం టిడిపి ఇంఛార్జ్ రామసుబ్బా రెడ్డిని చంద్రబాబు పిలిపించారు. ఆయనతో పాటు ఆయన పెద్దమ్మ లక్ష్మీదేవమ్మ(రామసుబ్బా రెడ్డి పెదనాన్న, మాజీ మంత్రి శివారెడ్డి సతీమణి) కూడా వచ్చారు.
ఆదినారాయణ రెడ్డి చేరికను అర్థం చేసుకోవాలని, పార్టీ అభివృద్ధి దృష్ట్యా ఈ చేరిక అవసరమని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆదినారాయణ రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకించిన లక్ష్మీదేవమ్మ ఒక్కసారిగా ఆవేదనకు గురయ్యారు.
తెలుగుదేశం పార్టీ కోసం తమ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, రాజకీయ పోరాటంలో తన భర్తను కోల్పోయానని, మమ్మల్ని అన్ని రకాలుగా ఇబ్బందులు చేసిన వారిని ఇప్పుడు పార్టీలోకి ఆహ్వానించడం ఎంతవరకు న్యాయమని చంద్రబాబును నిలదీశారు. ఉద్వేగానికి గురై ఆమె కంట తడిపెట్టారు.
ఆ తర్వాత ఆమెకు, రామసుబ్బా రెడ్డికి చంద్రబాబు సర్ది చెప్పారు. దీంతో ఒకింత అయిష్టంగానే రామసుబ్బారెడ్డి, లక్ష్మీదేవమ్మలు ఆదినారాయణ రెడ్డి చేరికకు పచ్చజెండా ఊపారు. ఆ తర్వాత ఆదినారాయణ రెడ్డి, ఇతరులు టిడిపిలో చేరారు.
ఆదినారాయణ రెడ్డి చేరికను రామసుబ్బా రెడ్డి మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు నచ్చచెప్పాక ఆయన విలేకరులతో మాట్లాడుతూ... చంద్రబాబు తమకు హామీ ఇచ్చారని, ఆది చేరికను స్వాగతిస్తామన్నారు. ఆదినారాయణ రెడ్డి కూడా.. ఇప్పటికే టిడిపిలో ఉన్న వారితో సర్దుకుపోతామన్నారు.
మరో విషయమేమంటే... అనంతపురం జిల్లాలో జెసి దివాకర్ రెడ్డి, పరిటాల సునీత గొడవలను రామసుబ్బా రెడ్డికి చంద్రబాబు గుర్తు చేశారని తెలుస్తోంది. అనంతపురం జిల్లాలోని మాజీ మంత్రి దివంగత పరిటాల రవి కుటుంబానికి, ప్రస్తుత అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికి మధ్య ఉన్న వైరాన్ని ఆయన ప్రస్తావించారు.
సుదీర్ఘకాలంగా రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగిన పరిటాల, జేసీ కుటుంబాలు ప్రస్తుతం టిడిపిలోనే ఉన్నాయని చెప్పారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా జెసి సోదరుల చేరికను పరిటాల రవి సతీమణి పరిటాల సునీత అంగీకరించారని చెప్పారు.
అయితే ఆ తర్వాత పరిటాల సునీతకు మంత్రి పదవిచ్చి ప్రాధాన్యమిచ్చిన వైనాన్ని ఆయన ప్రస్తావించారు. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా మీరు కూడా సర్దుకుపోవాలని, భవిష్యత్తులో ప్రాధాన్యమిస్తామన్న చంద్రబాబు ప్రతిపాదనతో కాస్తంత మెత్తబడ్డ రామసుబ్బారెడ్డి... ఆదినారాయణ రెడ్డి చేరికకు పచ్చజెండా ఊపారని తెలుస్తోంది.
కాగా, భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ చేరికలో బాలకృష్ణ, లోకేష్ కీలక పాత్ర పోషించారు. జలీల్ ఖాన్ చేరికలో మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రముఖ పాత్ర పోషించారు. ఆదినారాయణ రెడ్డి చేరిక విషయంలో ఎంపీ సీఎం రమేష్ చక్రం తిప్పారు.