‘హనీమూన్’ కొత్త జంటకు షాక్: రూంలోకొచ్చిన చిరుత(వీడియో)
నైనిటాల్: కొత్తగా పెళ్లయిన ఓ జంట హనీమూన్ కోసం నైనీటాల్ వెళ్లింది. అయితే, అక్కడే ఓ హోటల్లో బసచేస్తే కిటికీ నుంచి చొరబడిన చిరుతపులి వారిని హడలగొట్టింది. మొదట చిరుతను చూసి హడలెత్తిపోయిన ఆ జంట.. ఆ తర్వాత మాత్రం సంబరపడిపోయింది.
ఉత్తరాఖండ్లోని నైనీటాల్లోని ఓ హోటల్లో ఆదివారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సుమిత్, శివానీ అనే కొత్త జంట బస చేసిన నైనీటాల్లోని ఒక హోటల్ గదిలోకి చిరుత ప్రవేశించడంతో అప్పటిదాక సంతోషంగా ఉన్న భార్యాభర్తలు గజగజ వణికిపోయా రు. భయంతో ఏం చేయాలో తెలియకతెలియక భార్యపై దుప్పటి కప్పి భర్త కూడా అందులో దూరాడు.
మెల్లగా దుప్పటి కింది నుంచే దాని కదలికలు గుర్తించాడు. చిరుత బాత్రూమ్లోకి వెళ్లగానే తలుపులు మూసి.. ఒక్క ఉదుటన బయటకు పరుగెత్తి హోటల్ యాజమాన్యానికి సమాచారం అందించారు. అంతేగాక, చిరుత రూంలోకి వచ్చేందుకు అవకాశం కల్పించడంపై మండిపడ్డారు.
ఆ తర్వాత హోటల్ నిర్వాహకుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి పోలీసులు, అటవీశాఖ అధికారులు చేరుకొని దానిని బోనులో బంధించారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు. తమకు ఎలాంటి హానీ కలిగించకోపోవడం, అతి సమీపం నుంచి చిరుతను చూసే అవకాశం కలుగడంపై ఆ నవ దంపతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.