బీజేపీ మంత్రికి దావూద్ ఇబ్రహీం ఫోన్, ఎలా తెల్సింది?
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భారత్కు తరుచూ ఫోన్ కాల్స్ చేసే జాబితాలో బీజేపీ నేత, మహారాష్ట్ర మంత్రి ఏక్నాథ్ ఖడ్సే నెంబర్ ఉన్నదని అంటున్నారు. దావుద్ దేశంలోని కీలక రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నట్లు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
దావుద్ కరాచీలోని తన నివాసం నుంచి మహారాష్ట్ర సీనియర్ మంత్రి ఖడ్సేకు పలుమార్లు ఫోన్ చేసినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించింది. దావూద్ భార్య మెహజబీన్ షేక్ ఫోన్ నెంబర్ నుంచి మంత్రి ఫోన్ నెంబరుకు సెప్టెంబర్ 4, 2015 నుంచి ఏప్రిల్ 5, 2016 వరకు పలుమార్లు ఫోన్ కాల్స్ వచ్చాయని ఏఏపీ నేత ప్రీతిశర్మ ఆరోపించారు.
అయితే, ఈ ఆరోపణలను మంత్రి ఖడ్సే కొట్టి పారేశారు. ఆ జాబితాలో ఉన్న ఫోన్ నంబర్ తనదేనని, అయితే, తనకు మాత్రం దావూద్ నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ రాలేదని చెప్పారు. తనపై ఆరోపణలు చేసిన వారికి దావూద్ ఇబ్రహీం నంబర్ ఎలా తెలిసిందో చెప్పాలన్నారు.
ఆ ఫోన్ నంబరు దావూద్ ఇబ్రహీంది అని తెలిసినప్పుడు వారు పోలీసులకు ఎందుకు చెప్పలేదని ఏక్నాథ్ ప్రశ్నించారు. గత ఏడాదిగా తనకు ఎటువంటి విదేశీ ఫోన్ కాల్స్ రావడం లేదా తాను ఫోన్ చేయడం గానీ జరగలేదని ఖడ్సే పేర్కొన్నారు.
బహుషా ఈ నెంబరును క్లోనింగ్ చేసి ఉంటారని తెలిపారు. ఒకవేళ ఇతరులు ఈ నెంబరును ఉపయోగించి ఉంటే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి, ఎస్పీని కోరినట్లు తెలిపారు. ఏఏపీ చెబుతున్న తన ఫోన్ నెంబర్ గత ఏడాది నుంచి మనుగడలో లేదన్నారు.
మంత్రి ఖడ్సే వ్యాఖ్యలపై ఏఏపీ మాట్లాడుతూ.. మంత్రి అబద్దాలు చెబుతున్నారన్నారు. గత నెల 23వ తేదీన ఫోన్ బిల్లు కూడా మంత్రి ఇంటికి వచ్చిందన్నారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ను డిమాండ్ చేశారు.