సంతోషం.. సెలవు తీసుకోండి: ఆఫీసర్లకి కేజ్రీవాల్ షాక్
న్యూఢిల్లీ: సంతకం చేయలేదని ఇద్దరు ఆఫీసర్లను సస్పెండ్ చేసిన వివాదం ఢిల్లీలో ముదురుతోంది. ఇద్దరు ఆఫీసర్లను ఢిల్లీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ను కేంద్రం రద్దు చేసింది. అయితే, ఆఫీసర్లను సస్పెండ్ చేయడంపై దాదాపు 200 మంది అధికారులు నిరసన తెలిపారు.
తాము సామూహిక సెలవులు పెడతామని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను హెచ్చరించారు. దీనిపై కేజ్రీవాల్ అంతే ఘాటుగా స్పందించారు. గురువారం సాయంత్రం ఆయన మాట్లాడారు. మీరు సెలవులో వెళ్లడం సంతోషం, సెలవులోనే కొనసాగండని, ప్రజలు సంతోష పడతారని వ్యాఖ్యానించారు.
కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న డానిక్స్ (ఢిల్లీ, అండమాన్ అండ్ నికోబార్ ఐల్యాండ్స్ సివిల్ సర్వీస్) అధికారులు సెలవులో వెళ్తే తామేమీ భయపడేది లేదన్నారు. ప్రయివేటు వ్యక్తులను నియమించుకుని పాలన సాగించేందుకు కూడా వెనుకాడబోమన్నారు.
అంతేకాక కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పైనా కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. గవర్నర్ హోదాలో ఉన్న వ్యక్తి సర్కారుకు వ్యతిరేకంగా డానిక్స్ అధికారులు నిర్వహించిన సమావేశానికి ఎలా హాజరవుతారని ప్రశ్నించారు.
డానిక్స్ అధికారుల సామూహిక సెలవుతో కాస్తంత దిగి వస్తారనుకున్న కేజ్రీవాల్.. వారిపై ఘాటు వ్యాఖ్యలు చేసి కేంద్రంపై మరోమారు యుద్ధానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేసినట్లు చెప్పవచ్చు. కాగా, ఇటీవల కేజ్రీవాల్ కేంద్రంపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు.