ఇంత తక్కువా, బాబు రహస్యం ఏమిటో?: మోడీ ఆరా!
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్, పైబర్ గ్రిడ్ తదితర వాటి పైన కేంద్రం, ఇతర రాష్ట్రాలు ఆరా తీస్తున్నాయట. ఈ నెల 16వ తేదీన ఢిల్లీలో అంతర్రాష్ట్ర మండలి సమావేశాలు జరగనున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత ఇవి జరుగుతున్నాయి.
నేడు అమరావతిలా, నాడు ఆస్తానా కష్టాలు: పట్టుబట్టి బాబుని పంపిన మోడీ
ఈ సమావేశంలో తనదైన ముద్ర వేసేందుకు ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గతంలో హైదరాబాద్ అభివృద్ధి ద్వారా చంద్రబాబు యావత్ దేశాన్ని ఆకర్షించారు. ఇప్పుడు విభజన నేపథ్యంలో ఏపీని అన్ని రంగాల్లో ముందుంచేందుకు ఆయన కృషి చేస్తున్నారు.
ఇందులో భాగంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. వీటి పైన ఏపీ ప్రభుత్వం ఢిల్లీలో జరగనున్న అంతర్రాష్ట్ర మండలి సమావేశాల్లో ప్రజెంటేషన్లు ఇవ్వనుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే ప్రత్యేకంగా, అమలు చేస్తున్న మెరుగైన విధానాల్ని తీసుకొని, వాటి వివరాల్ని నీతి ఆయోగ్కు పంపించింది.
ఒక్కో రాష్ట్రం గరిష్ఠంగా మూడు విధానాలపై మాత్రమే ప్రజంటేషన ఇవ్వాలి. ఏపీ ఫైబర్ గ్రిడ్, స్మార్ట్ వార్డ్, స్మార్ట్ విలేజ్, ఎల్ఈడీ బల్బులు, నదుల అనుసంధానం, ల్యాండ్ పూలింగ్ విధానాలపై నీతిఆయోగ్కు పంపడం గమనార్హం. ఇందులో రాష్ట్ర అనుమతితో మూడు విధానాలను నీతిఆయోగ్ ఎంపిక చేయనుంది. వీటిలో భూసమీకరణ, ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులు కేంద్రం, ఇతర రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తున్నాయంటున్నారు.
విభజన నేపథ్యంలో ఏపీలో రాజధాని అమరావతి కోసం ప్రభుత్వం 33 వేల ఎకరాలను సేకరించింది. ప్రతిపక్షాల విమర్శలు, కొన్ని విమర్శలు, కొందరి అసంతృప్తిని పక్కన పెడితే... ఇంత పెద్ద మొత్తంలో సేకరణ అద్భుతమని టిడిపి నేతలు చెబుతున్నారు. ఇంత పెద్ద ఎత్తున సేకరణ దేశంలోనే మొదటిసారి.
అంతర్రాష్ట్ర మండలి భేటీలో ఇదే హైలైట్ అవుతుందని అధికారులు భావిస్తున్నారట. 33,000 ఎకరాల భూసమీకరణ కింద ఇవ్వడం, ఇందుకు ఉపయోగపడిన అంశాలు, పరిహారం ప్యాకేజీల గురించి రాష్ట్ర ప్రభుత్వం నీతి ఆయోగ్కు సవివరంగా లిఖితపూర్వకంగా పంపింది. ఈ నేపథ్యంలో 16న జరిగే భేటీలో ల్యాండ్ పూలింగ్ విధానం ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు.
కేబుల్ కారు పైన మనసుపడ్డ చంద్రబాబు, ఏపీకి తీసుకొచ్చే యోచన
రాబోయే మూడేళ్లలో ఇంటింటికీ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుపై కేంద్రం ఇప్పటికే ప్రశంసల వర్షం కురిపించింది. వేల కోట్ల రూపాయల ఖర్చు అవుతుందనుకున్న ప్రాజెక్టును వందల కోట్ల రూపాయల వ్యయంతో ఏపీ ప్రభుత్వం అమలుచేయడంపై కేంద్రం సహా, ఇతర రాష్ట్రాలన్నీ ఆసక్తిగా ఉన్నాయి.
ఏపీ ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రూ.150కే నెట్ కనెక్షన్ అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 2018కల్లా ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని భావిస్తోంది.
ప్రతి ఇంటికీ 10 నుంచి 20 ఎంబీపీఎస్, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఒకటి నుంచి 10 జీబీపీఎస్ స్పీడ్తో నెట్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. అన్ని గ్రామాలకూ ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని, విద్య, వైద్య శాలల సహా 46 వేల ప్రభుత్వ కార్యాలయాలకు ఉచిత కనెక్టివిటీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.