కుబేరుడికి నిబంధనలు?: అంబానీ కోసం అర్ధరాత్రి తెర్చుకున్న అలిపిరి గేట్లు!
తిరుపతి: ఆయన దేశంలోనే అత్యంత సంపన్నుడు. ఆయన కోసం తిరుమలలోని అలిపిరి టోల్గేట్ అర్ధరాత్రి ఒంటిగంటకు తెరుచుకుంది. నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ.. ఆ కుబేరుడికి అర్ధరాత్రి టోల్గేట్ తెరిచి తిరుమలకు స్వాగతం పలికారు. ఆయనే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ.
ముకేష్ అంబానీ గురువారం రాత్రి కుటుంబ సమేతంగా తిరుమలకు విచ్చేశారు. సాధారణంగా ప్రతి రోజు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 3 గంటల వరకు టోల్గేట్ మూసి ఉంటుంది. అయినప్పటికీ టీటీడీ అధికారులు ముఖేష్ అంబానీ కోసం అర్ధరాత్రి టోల్గేట్ను తెరిచి కొండపైకి పంపడం పలు విమర్శలకు తావిస్తోంది.
శ్రీవారి సేవలో ముఖేష్ అంబానీ
తిరుమల శ్రీవారిని శుక్రవారం ఉదయం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, తనయుడు అనంత్ అంబానీ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితోపాటు కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానందగౌడ శ్రీవారిని దర్శించుకున్నారు. టిటిడి అధికారులు ప్రముఖులకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.