రాజకీయాలు విడగొడతాయి: లోకేష్ ఆసక్తికర వ్యాఖ్య
విజయవాడ: రాజకీయాలు మనుషులను, ప్రాంతాలను విడగొడితే, భాష ఒక్కటే అందరినీ కలుపుతుందని తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ పేర్కొన్నారు. తెలుగు భాషా ప్రాబల్యం తగ్గుతున్న తరుణంలో రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
విజయవాడ సాహితీ సాంస్కృతిక సంస్థలు, ఎన్టీఆర్ ట్రస్ట్ సంయుక్తంగా మంగళవారం విజయవాడలోని శేషసాయి కళ్యాణ మండపంలో తెలుగుభాషా సాంస్కృతిక సమ్మేళనం, మండలి బుద్ధప్రసాద్ షష్ఠిపూర్తి మహోత్సవాలను నిర్వహించారు.
ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీ రావు ఆధ్యక్షతన జరిగిన ముంగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లోకేష్ హాజరయ్యారు. ఆయన మాట్లాడారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్ని సమస్యలు వచ్చినా భాష ద్వారా వాటిని పరిష్కరించుకునే వీలుంటుందన్నారు.
ఈ సమ్మేళనంలో అందరి సూచనలు, సలహాలను నివేదిక రూపంలో పొందుపరిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలసి విన్నవిస్తామన్నారు.
రాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు భాషా పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, మహానుభావుల జయంతి వేడుకలను రాష్ట్ర పండగలుగా నిర్వహిస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికే సుమారు 50 కోట్ల రూపాయల నిధులను ఇందుకోసం కేటాయించినట్లు చెప్పారు.
లతిత కళా అకాడమీ, సంగీత అకాడమీ, సాహిత్య అకాడమీలను పునరుద్ధరించనున్నట్లు ఆయన ప్రకటించారు. తుర్లపాటి కుటుంబరావు మాట్లాడుతూ... క్షీణ దశకు చెరుకున్న తెలుగు భాషా పరిరక్షణకు అందరూ కృషి చేయాలన్నారు.