రంజితను పక్కన పెట్టేసి నిత్యానంద ఇలా: ఎందుకు?
తిరుపతి: వివాదాలకు ఆలవాలంగా మారిన స్వామి నిత్యానంద ఒక్కసారిగా కొత్త గెటప్తో తిరుమలలో దర్శనమిచ్చాడు. ఎక్కడికి వెళ్లినా తన అనుంగు శిష్యురాలైన రంజితను పక్కనే ఉంచుకుని వెళ్లే నిత్యానంద శుక్రవారం మాత్రం తిరుమల వెంకన్న దర్శనం కోసం ఆమెను పక్కన పెట్టి తన అనుచరగణంతో విచ్చేశాడు.
నిత్యానంద దర్శించుకుని వెళ్లిన తర్వాత రంజిత శ్రీవారిని దర్శించుకోవడం గమనార్హం. ఇంతకు ముందు 2014లో శ్రీవారి దర్శనానికి నిత్యానంద, రంజిత కలిసి వచ్చారు. అయితే తాజాగా నేడు ఇద్దరూ విడివిడిగా వెంకన్నను దర్శించుకోవడంపై చర్చనీయాంశంగా మారింది.
అంతకు ముందు రోజే రంజిత, నిత్యానంద కలిసే శ్రీకాళహస్తి వచ్చారు. ఈ సందర్భంగా నిత్యానంద అనుచరులు చేసిన హంగామా వివాదాస్పదమైంది. నిత్యానంద, రంజితలను చిత్రీకరిస్తున్న మీడియా సిబ్బందిని వారు అడ్డుకున్నారు. ఫొటోగ్రాఫర్లతో వారు దురుసుగా ప్రవర్తించి తోసేశారు. మీడియాతో మాట్లాడకుండానే నిత్యానంద, రంజిత అక్కడ్నుంచి తిరుగుపయనమయ్యారు.
నిత్యానంద, రంజిత మళ్లీ తెర మీదికి వచ్చిన నేపథ్యంలో ఆశ్రమంలో జంపింగ్ యోగా పేరుతో వారు చేసిన, చేయించిన విచిత్ర విన్యాసాలు నెట్లో సందడి చేస్తున్నాయి. ఆశ్రమానికి వచ్చిన భక్తుల చేత యోగా పేరుతో కూర్చున్న చోటు నుంచి పైకి ఎగరడం, పూనకం వచ్చినట్టు ఊగిపోవడం వంటివి చేయిస్తుంటారు.