మాటమారింది: ఐటీ ఉద్యోగాలపై చేతులెత్తేసిన కెటిఆర్!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో టిఆర్ఎస్ నేతల మాటల్లో మార్పు కనిపిస్తోంది. నిన్నటిదాకా సీమాంధ్ర వారిని తిట్టిన వారు ఇప్పుడు ఓట్ల కోసం వాళ్ల కాళ్ళబేరానికి వెళ్తున్నారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. మంత్రి కెటిఆర్ మంగళవారం నాడు తాను కూడా సెటిలర్నే అంటూ ఆసక్తికర వ్యాఖ్య చేశారు.
హైదరాబాదులో సెటిలర్లు ఎవరూ లేరని, ఆ మాటకు వస్తే నేను కూడా సిద్దిపేట నుంచి వచ్చి స్థిరపడ్డానని, కాబట్టి నేనూ సెటిలర్నేనని వ్యాఖ్యానించారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో టీయూడబ్ల్యూజే, హెచ్యూజే, టీఎస్పీజేఏ సంఘాలు ఏర్పాటుచేసిన మీట్ ది ప్రెస్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఉద్యమ సమయంలో సీమాంధ్రులు గో బ్యాక్ అంటూ వ్యాఖ్యలు చేశారుగా అని జర్నలిస్టులు ప్రశ్నించగా.. అది ఉద్యమ సమయమని, భావోద్వేగాలతో అలా మాట్లాడిన మాట వాస్తవమేనని, ఇప్పుడు మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల కోరిక నెరవేరిందన్నారు
ప్రజలంతా తమ పార్టీకి అధికారమిచ్చారని, ఇప్పుడు తమ ముందు అభివృద్ధి అంశం మాత్రమే ఉందని, ప్రాంతీయ భేదాల్లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాల్ని చేరవేస్తామన్నారు. ఐటీ సెక్టార్లో స్థానికులకు రిజర్వేషన్ అసాధ్యమన్నారు. ప్రయివేటు రంగంలో నిష్ణాతులనే తీసుకుంటారని, అయినా ఇతర ప్రయివేటు రంగాల్లో రిజర్వేషన్లు లేవన్నారు.
కెటిఆర్
ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ ప్రజలు యాభై ఏళ్లపాటు కాంగ్రెస్, బిజెపి, టిడిపి, మజ్లిస్ పార్టీలను గెలిపించినా న్యాయం జరగలేదని కెటిఆర్ అన్నారు. సాధారణ ఎన్నికలు, కంటోన్మెంట్ ఎన్నికల్లో మాదిరే జీహెచ్ఎంసీ పోరులోనూ తెరాసకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు.
కెటిఆర్
మహిళలకు కేటాయించిన 75 స్థానాల్లో సొంత పార్టీ వాళ్లతోపాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన ప్రజాదరణ ఉన్న నేతలకూ స్థానం కల్పిస్తామని, గెలుపుపై నమ్మకం కోల్పోయిన టిడిపి, బిజెపి నాయకులు చేసే సవాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
కెటిఆర్
దేశానికి స్వాతంత్య్రంవచ్చినప్పటికే హైదరాబాద్ ఐదో అతిపెద్ద నగరమని, అంతటి గొప్ప చరిత్ర గల నగరాన్ని తామే ప్రపంచానికి పరిచయం చేశామని కొందరు నేతలు గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ఇటీవల వంద సెంటీమీటర్ల వర్షం కురిస్తే చెన్నై నగరం నీట మునిగిందని, హైదరాబాద్లోనూ గంటసేపు వాన కురిస్తే రోడ్లన్నీ నదుల్లా మారిపోతాయన్నారు.
కెటిఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉక్కు సంకల్పం గల నాయకుడని, ఆగమేఘాల మీద గోదావరి జలాలను నగరానికి తెచ్చారని, మేం పూర్తిచేసే ప్రతి పనికి తామే శిలాఫలకం వేశామంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం హాస్యాస్పదమన్నారు. శంకుస్థాపన చేస్తే సరిపోదని, చిత్తశుద్ధితో పూర్తిచేసి ప్రజలకు అందించాలన్నారు.
కెటిఆర్
తెరాస ప్రభుత్వం ఏర్పడిన 18నెలల్లో తొమ్మిది నెలలు గత పాలకుల తప్పిదాలను సరిదిద్దేందుకే సరిపోయిందన్నారు. మిగిలిన 9 నెలల్లో దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, అవి చాలు హైదరాబాదీయులు మమ్మల్ని తప్పక గెలిపిస్తారని చెప్పేందుకు అన్నారు.
కెటిఆర్
హైదరాబాద్ కోటికి పైగా జనాభాతో చుట్టూ ఉన్న ఐదు జిల్లాలతో కలిసిపోయిందని, భవిష్యత్తులో నగర జనాభా రూ.5 కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని, త్వరలోనే ముఖ్యమంత్రి చేతులమీదుగా వరంగల్లో ఐటీ కంపెనీల ప్రారంభోత్సవం జరగనుందని,అన్ని జిల్లాలను సమాంతరంగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ కంకణబద్ధుడై అహర్నిశలు కష్టపడుతున్నారన్నారు.