'గంగా' ఎఫెక్ట్, పిల్లనివ్వం: ఆ యువకులకు చేదు
బిజ్నోర్: గంగానది కారణంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్ జిల్లాలో 25 నదీ ప్రవాహ ప్రాంతాల్లోని యువకులకు పెళ్లి ఇబ్బందిగా మారింది. ఈ గ్రామాలలోని యువకులకు ఇచ్చి పెళ్లి చేయడం కంటే అమ్మాయిలను తమ ఇళ్లలో పెళ్లి చేయకుండా ఉంచడమే మంచిదని చాలామంది భావిస్తున్నారు.
దీంతో బిజ్నోర్ జిల్లాలోని చాలా గ్రామాల్లో పెళ్లిళ్లు జరగడం లేదు. తమ కూతుళ్లను ఈ 25 గ్రామాల్లోని యువకులకు ఇచ్చి పెళ్లి చేయకపోవడానికి మిగతా గ్రామాల్లోని తల్లిదండ్రులకు ఓ కారణం ఉంది. అదీ గంగానది.
గంగానదిని ఈ 25 గ్రామాలున్నాయి. ఆ గ్రామాలకు గంగానది నుంచి సరైన రక్షణ లేదా గట్టు లేకపోవడంతో వరదల సమయంలో తరచూ ఈ గ్రామాలు మునిగిపోతుంటాయి. దీంతో పంటలు నాశనమవుతున్నాయి. సారవంతమైన పంట భూములు కోతకు గురవుతున్నాయి.
దీంతో వరద బాధిత గ్రామాలకు పిల్లను ఇచ్చేందుకు అమ్మాయిల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఉత్తరాఖండ్ నుంచి బిజ్నోర్ జిల్లాలో ప్రవహించే గంగానదితో ఇటీవలి వరకు నదీ పరివాహక గ్రామాలు సుభిక్షంగా ఉండేవి. అందరూ సుఖసంతోషాలతో ఉండేవారు.
అయితే గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితి మారిపోయింది. దీనికి కారణం గంగానదికి వరదలు. వరదలతో ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. నది ఉగ్రరూపానికి పచ్చని పంట పొలాల్లోని సారవంతమైన నేల కోతకు గురవుతోంది. పంటలు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి.
వర్షాకాలంలో గ్రామస్తుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంటోంది. ఇళ్లు, పంట పొలాలను నది ముంచుతోంది. ఫలితంగా గ్రామస్తులు దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. ఎప్పుడు ఏ వైపు నుంచి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. దీంతో, బిజ్నోర్లోని ఈ గ్రామాల యువకులకు పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.