మమత పోరు: ఆమె భయానికి కారాణాలు ఈ రెండేనా?
మమతా బెనర్జీ మాత్రం పెద్ద నోట్ల రద్దుపై ఏకంగా ప్రధాని మోడీతో యుద్ధాన్నే ప్రకటించారు. ఆయనను రాజకీయాల్లో నుంచి తరిమేసేందుకు తన ప్రాణమున్నంత వరకూ పోరాడతానని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ/కోల్కతా: పెద్ద నోట్ల రద్దు ప్రకటనను మొదటి నుంచీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, వామపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కాగా, నల్లధనం పోరాటానికి తాము వ్యతిరేకం కాదంటూనే కాంగ్రెస్ పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తోంది. అయితే, మమతా బెనర్జీ మాత్రం పెద్ద నోట్ల రద్దుపై ఏకంగా ప్రధాని మోడీతో యుద్ధాన్నే ప్రకటించారు. ఆయనను రాజకీయాల్లో నుంచి తరిమేసేందుకు తన ప్రాణమున్నంత వరకూ పోరాడతానని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థి పార్టీ నేతల నుంచి పలు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మమతా బెనర్జీ అంత ఆగ్రహావేశాలతో ఎందుకు ఊగిపోతున్నారు? పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వాపసు తీసుకోవాలని ఎందుకంత గట్టిగా పట్టుబడుతున్నారు? నారద, శారద కుంభకోణాల ద్వారా కూడబెట్టుకున్న డబ్బంతా పనికిరాకుండా పోతున్నందువల్లే ఆమె అంతలా యాగీ చేస్తున్నారని బిజెపి నేతలు అంటున్నారు. ఈ స్కాం ద్వారా మమత పార్టీ నేతలు వేల కోట్లు దోచుకుని దాచుకున్నారనేది బిజెపి నేతల ఆరోపణ. ఇటీవల భారతీయ జనతాపార్టీ ప్రతినిధి సిద్ధార్థనాథ్ సింగ్ ఢిల్లీలో ఇదే మాట అన్నారు. దీన్ని తేలిగ్గా కొట్టిపారేయలేమని, ఆ కుంభకోణాల తాలూకు డబ్బు తృణమూల్ కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లిందన్నది తీవ్రమైన ఆరోపణే అని, నిజానిజాల నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు.
అంతేగాక, 'మమత కేవలం రాజకీయ కారణాలతోనే ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారనడంలో సందేహం లేదు. నిస్సహాయులు, అణగారిన వర్గాల తరఫున తాను మాట్లాడుతున్నానని ఆమె అంటున్నారు. పశ్చిమబెంగాల్లో ఆమె రాజకీయ ఆధిపత్యానికి ప్రస్తుతం తిరుగులేదు. అయినప్పటికీ, ప్రజల నోళ్లలో తన పేరు ఎప్పుడూ నానుతూనే ఉండాలని ఆమె కోరుకుంటున్నారు. అందుకే తరచూ ఏదో ఒక సంచలనానికి కేంద్రబిందువు అవుతున్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్యులకు కొంతవరకు ఇబ్బందులు ఎదురవుతున్నమాట నిజమే. భవిష్యత్తులో మంచి జరుగుతుందన్న ఆశాభావంతో ఉన్న ప్రజలు.. ప్రస్తుత సమస్య తాత్కాలికమైనదేనని భావిస్తున్నారు. కానీ, సమస్యల్ని భూతద్దంలో చూపి, తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు' అని ఆయన ధ్వజమెత్తారు.
మోడీ మీద ఆమె దుమ్మెత్తిపోయడానికి అసలు కారణం ఇదేనని స్పష్టం చేశారు. అందుకోసమే తన బద్ధశత్రువైన సీపీఐ(ఎం)ను కలుపుకొని వెళ్లడానికీ ఆమె ప్రయత్నిస్తున్నారని అన్నారు. కాగా, తనతో చేతులు కలపాల్సిందిగా సీతారాం ఏచూరిని ఆమె ఇటీవల ఆహ్వానించారు. కానీ, ఆయన అంతగా ఆసక్తి కనబరచలేదు. మమత సీపీఐ(ఎం)తో జట్టు కట్టడానికి సిద్ధపడతారని కొన్ని నెలల క్రితం వరకూ ఎవరూ ఊహించి ఉండరు.
కానీ, రాజకీయాల తీరే అలాంటిది. అవసరాలను బట్టి బద్ధశత్రువులు సైతం ఆప్తమిత్రులైపోతారు. కాంగ్రెస్ సైతం అంటీముట్టనట్లు వ్యవహరించింది. నల్లధనం మూలాల మీద దెబ్బకొట్టేందుకు మోడీ.. పెద్ద నోట్ల రద్దు ద్వారా సంచలన నిర్ణయం ప్రకటించారు. దాన్ని వ్యతిరేకించడమంటే నల్లధన స్వాముల్ని సమర్థించడమేనని కాంగ్రెస్ పార్టీ భావించింది.
కాగా, ఎంతో సున్నితమైన ఈ వ్యవహారంలో మమత అడుగుజాడల్లో నడవడానికి సీపీఐ(ఎం)కానీ, కాంగ్రెస్ పార్టీకానీ తయారుగా లేవు. కాగా, అరవింద్ కేజ్రీవాల్ మాత్రం మొదటి నుంచి బిజెపిని వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మమతకు మద్దతుగా నిలిచారు. సామాన్యులు ఇబ్బందు ఎదుర్కొంటున్నారంటూ మమతకు మద్దతుగా తన గళమెత్తారు.
ఆమె భయానికి రెండు కారణాలు?
పశ్చమబెంగాల్లో బిజెపి పాగా వేసే అవకాశం ఉందనే భయంతోనే మమతా విరుచుకుపడుతున్నారని ప్రత్యర్థి పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆమె భయానికి రెండు కారణాలు ఉన్నాయంటున్నారు. రెండు మూడు మాసాల్లో కొన్ని రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాక, తాను బలహీనంగా ఉన్న ప్రాంతాలపై బిజెపి దృష్టి సారించవచ్చునని, వాటిలో పశ్చిమబెంగాల్ ఉంటుందని ఆమె అనుకొంటున్నారు. ఈ రాష్ట్రంలోకి చొచ్చుకువెళ్లడానికి వీలుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన సర్కారుకు అడుగడుగునా అడ్డంకులు కల్పించవచ్చునని ఆమె భావిస్తున్నారు. ఇది మొదటి కారణం.
రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తరవాత బిజెపికి రాజ్యసభలో తగినంత బలం చేకూరుతుంది. అప్పుడిక ఏ విషయంలోనూ మమత సహా ఏ పార్టీ మద్దతూ అవసరం ఉండదు. శారదా కుంభకోణంపై సీబీఐ దర్యాప్తూ జోరందుకోవచ్చు. అదే జరిగితే మమత ఇరుకున పడిపోవడం ఖాయం. దానివల్ల ఆమె రాజకీయ భవిష్యత్తే ప్రమాదంలో పడవచ్చు. ప్రస్తుతం మమతను పీడిస్తున్న అసలు భయం ఇదే. ఆ ఆందోళన ఆమెలో స్పష్టంగా కనిపిస్తోంది. బిజెపి మీద ప్రత్యేకించి మోడీపైన ఆమె ఈ స్థాయిలో విరుచుకుపడటానికి ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పెద్దనోట్ల రద్దు అంశం ఆమె ఆయుధంగా మార్చుకుంది.