'పాక్ వర్సిటీలో ఉగ్రదాడి వెనుక భారత్, పారికర్ కుట్ర'
లాహోర్: పాకిస్తాన్ వాయువ్య ప్రాంతమైన చర్సద్దా నగరంలోని బచాఖాన్ విశ్వవిద్యాలయంపై ఉగ్రవాదుల దాడి వెనుక భారత్ రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ఉన్నారంటూ పాకిస్తాన్ మాజీ మంత్రి రెహ్మాన్ మాలిక్ అర్థరహితమైన ఆరోపణలు చేశాడు.
బచాఖాన్ యూనివర్సిటీపై బుధవారం జరిగిన ఉగ్రవాద దాడికి తామే కారణమని తెహ్రీక్-ఏ-తాలిబాన్ ప్రకటించింది. అయితే, పాక్ మాజీ మంత్రి రెహ్మాన్ మాలిక్ మాత్రం సంచలన ప్రకటన చేయడం గమనార్హం. దాడి వెనుక భారత్ హస్తముందని ఆయన ప్రకటించాడు.
అంతేకాదు, దాడి వెనుక భారత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ కుట్ర దాగుందని వ్యాఖ్యానించాడు. తాలిబాన్లతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్న భారత్ ఈ దాడికి పథక రచన చేసిందని ఆరోపించాడు. మనోహర్ పారికర్ కనుసన్నల్లో నడుస్తున్న భారత గూఢచార సంస్థ రీసెర్చి అండ్ అనాలసిస్ వింగ్ (రా) ఈ దాడికి రూపకల్పన చేసిందని మాలిక్ వ్యాఖ్యానించాడు.
ఇదే సమయంలో పంజాబ్లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన దాడిని సైతం ప్రస్తావించాడు. పఠాన్ కోట్ దాడిలో జైషే మొహ్మద్ పాత్ర లేదని, భారతీయులే ఆ తరహా దాడులకు పాల్పడుతున్నారని, భారత్, పాక్ల మధ్య సంబంధాలు మెరుగవడం 'రా'కు ఇష్టం లేదని వ్యాఖ్యానించాడు.
ఎప్పుడైతే చర్చలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ముందడుగు వేశారో, దానిని నిలువరించేందుకు 'రా'అధికారులు ఈ దాడులకు తెర తీశారని వ్యాఖ్యానించాడు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో పారికర్ ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పాకికర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ... ఆ తరహా ఘాటు వ్యాఖ్యలు చేయడానికి పారికర్కు ఎంత ధైర్యమంటూ ఊగిపోయాడు.