కాపు కాసినప్పుడు: పవన్ డైలాగ్ ఎవరి గురించి..?
హైదరాబాద్: తన అభిమానులను దృష్టిలో పెట్టుకుని పవన్ కల్యాణ్ అంతా తానే అయి రూపొందించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలోని ఓ డైలాగు రాజకీయ రంగంలో చర్చకు దారి తీసింది. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆ డైలాగు ఎవరిని ఉద్దేశించి చెప్పారనే విషయంపై చెవులు కొరుక్కుంటున్నారు.
పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఉగాది పర్వదినం రోజు విడుదలైన విషయం తెలిసిందే. థియేటర్ల వద్ద అభిమానుల సందడి చెప్పనలవి కాదు. ఈ సినిమాలో పవన్ పంచ్ డైలాగ్స్తో పాటు కొన్ని పొలిటికల్ డైలాగ్స్ను కూడా పేల్చినట్లు భావిస్తున్నారు.
‘కాపు కాసినప్పుడు గుర్తుకురాని నా కులం, అవసరం తీరిపోయాక గుర్తొచ్చిందా?' అంటూ పవన్ ఓ డైలాగ్ పేల్చాడు. ఆ సందర్భానికి తగిన డైలాగ్ అని ఫ్యాన్స్ అంటున్నారు. కానీ ఈ డైలాగ్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని చెప్పిందేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ డైలాగ్ ఏపీలో పొలిటికల్ హీట్ను మరింత పెంచేదిగా ఉందని చెబుతున్నారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంతో అట్టుడికిన ఆంధ్రప్రదేశ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే పవన్ ఈ డైలాగ్ చెప్పాడని వినికిడి. కాపు రిజర్వేషన్లపై ఆందోళనకు దిగిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని ఉద్దేశించి ఈ డైలాగు చెప్పాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.