"ట్యాంక్ బండ్ పై కేసీఆర్ కు విగ్రహం కావాలా..? వద్దా..?"
హైదరాబాద్ : 'తెలంగాణలో విద్యావ్యవస్థ సమస్యలు-పరిష్కారాలు' అనే అంశంపై తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ) ఆధ్యర్యంలో జరిగిన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.
సదస్సులో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రొఫెసర్ హరగోపాల్.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ప్రజల జీవిన స్థితిగతులు మెరుగువుతాయని, ప్రభుత్వ విద్యాయాలయాలు మరింత పటిష్ట పరిచేలా చర్యలు తీసుకుంటారని తాము భావించినట్టుగా చెప్పారు. అయితే అందుకు భిన్నంగా ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు పూర్తయినా నూతన విద్యా విధానానికి రూపకల్పన జరగలేదని అసహనం వ్యక్తం చేశారు.
ఇక టీఆర్ఎస్ పనితీరు గురించి ప్రస్తావిస్తూ.. "పాలకులు మంచి చేస్తే ప్రజలు ట్యాంక్ బండ్ పై విగ్రహం ఏర్పాటు చేస్తారు, లేదు.. ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడితే గతం పునరావృతమయ్యే పరిస్థితి తలెత్తుతుంది, కాబట్టి విగ్రహం కావాలా..? వద్దా..? అనేది కేసీఆర్ ప్రభుత్వమే నిర్ణయించుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు.
ఇదే సదస్సులో వ్యవసాయ విశ్వ విద్యాలయాల్లో సిబ్బంది నియామాకాల గురించి మాట్లాడిన హరగోపాల్.. నియామాకాలు టీఎస్.పీ.ఎస్.సీ ద్వారా చేపట్టాలా వద్దా అనే అంశం గురించి చర్చించడానికి ప్రభుత్వం హాల్ మీటింగ్ కి అనుమతి ఇవ్వకుండా భారీగా పోలీసులను మోహరించడాన్ని హరగోపాల్ తప్పుబట్టారు.
గత నాలుగున్నర దశాబ్దాల్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదని ఆవేదన వ్యక్తం చేశారు హరగోపాల్. హాల్ మీటింగ్ లాంటి చిన్న చిన్న సదస్సులకే అవకాశం ఇవ్వనివారు ఇక బహిరంగ సమావేశాలు ఏర్పాటు చేయాలనుకుంటే ఏం అవకాశమిస్తారని..!, ఈ పరిస్థితులను చూసి తనకు భయమేసిందని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయితే శ్రీ చైతన్య నారాయణ లాంటి కార్పోరేట్ యాజమాన్యాలకు తెలంగాణలో చోటుండదని ఆశించామని, కనీసం ఫీజుల విషయంలోనైనా ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతుందనుకున్నామని, ఇవేవీ జరగనప్పుడు ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు.
ఇక యూనివర్సిటీల స్థితి గతులపై స్పందిస్తూ.. ఎన్టీఆర్ హయాం నుంచి విశ్వ విద్యాయాల ధ్యంసం ఆరంభమైందని చెప్పుకొచ్చిన ఆయన, ఒకానొక దశలో అసలు తెలంగాణలో విశ్వవిద్యాలయాలు ఉంటాయా అన్న స్థితికి పరిస్థితులను తీసుకొచ్చారన్నారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వానికి వీసీలను నియమించడానికి ఇంకెంత సమయం కావాలని నిలదీసిన ఆయన, అధ్యాపకుల నియామాకాలు లేకుండా, గ్రాంట్లు పెంచకుండా, వీసీలను నియమించకుండా యూనివర్సిటీలను గాలికి వదిలేశారన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు.
యూనివర్సిటీలకు స్వయంప్రతిపత్తి హోదా కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసిన హరగోపాల్.. వర్సిటీల నియామాకాల్లో వీసీ తప్పు చేస్తే కమిటి వేసి నిర్దారించాలని అంతేగానీ తలనొప్పి వస్తే తలకాయే తీసేసిన చందంగా వ్యవహరించవద్దని ప్రభుత్వానికి హితవు పలికారు.
తెలంగాణ రాష్ట్రానికి అంటూ ఓ ప్రత్యేక నూతన విద్యా విధానం ఉండాలని సూచించిన హరగోపాల్, ఇందుకోసం నిపుణులు, మేధావులతో కలిసి కమిటీ వేసి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.