ఆడోరకం, ఈడోరకం!: 'తెలంగాణ' చేరికలపై రావెల సంచలనం
హైదరాబాద్: తెలంగాణలో ప్రాంతీయవాదం కారణంగానే ఇతర పార్టీలకు చెందిన నేతలు అధికార తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్నారని ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు శనివారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న నావ అన్నారు.
తగలబడుతున్న ఇల్లు, మునిగిపోతున్న నావ నుంచి అంతా బయటపడాలని చూస్తారని అన్నారు. ఏపీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధిని చూసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని రావెల చెప్పారు. తెలంగాణలో చేరికలను వ్యతిరేకించిన రావెల, ఏపీలో మాత్రం అభివృద్ధి కోసం వస్తున్నారని చెప్పడం విడ్డూరం.
కాగా, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విపక్షాలకు చెందిన నేతలు అధికార పార్టీలలో చేరుతున్న విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో అధికార టిఆర్ఎస్ 63 స్థానాలు గెలుచుకుంటే ఇప్పుడు ఆ పార్టీకి ఎనభైకి పైగా శాసన సభ్యులు ఉన్నారు.
తెలుగుదేశం, బిఎస్పీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఇరవైకి పైగా ఎమ్మెల్యేలు తెరాసలో చేరారు. ప్రజాప్రతినిధులు కాకుండా ఇతర నేతలు కూడా చేరుతున్నారు.
అదేవిధంగా ఏపీలోని విపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అధికార టిడిపిలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటి దాకా వైసిపి నుంచి 12 మంది ఎమ్మెల్యేలు సైకిల్ ఎక్కారు. మరికొంతమంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు.