సీక్రెట్: త్వరలో ప్రియుడితోనే సాక్షి మాలిక్ పెళ్లి!
ఛండీఘర్: రియో ఒలింపిక్స్లో భారత్కు తొలి పతకం అందించి చరిత్ర సృష్టించిన రెజ్లర్ సాక్షి మాలిక్ ఇప్పుడు ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. త్వరలోనే తాను వివాహం చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందర్నీ షాక్కు గురిచేసింది.
అంతేగాక, తను ప్రేమించిన వ్యక్తితోనే తన వివాహమంటూ మరో ట్విస్ట్ ఇచ్చింది సాక్షి. తను ప్రేమిస్తుంది కూడా తన సహచర రెజ్లింగ్ ఆటగాడిననే క్లూ కూడా ఇచ్చింది.
బెంగాలీ దినపత్రిక 'ఆనంద్ బజార్' పత్రికకు ఇచ్చిన సాక్షి తన పెళ్లి గురించి మనసులో మాటను చెప్పింది. రియో ప్రదర్శన తర్వాత సాక్షి జీవితమే మారిపోయిన నేపథ్యంలో ఆమె పెళ్లి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆమెకు గొప్ప గొప్ప సంబంధాలు వచ్చే అవకాశముందని అనుకుంటుండగానే.. ఆమె తన ప్రేమ విషయాన్ని బయటపెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
తన ప్రియుడి గురించి సాక్షి ఇలా చెప్పుకొచ్చింది..'అతను నాకెంతో మద్దతుగా ఉన్నాడు. నా కలను తన కలగా భావించాడు. పెళ్లి తర్వాత కూడా అతను నాకో స్నేహితుడిలా ఉంటాడు. నా ఆటకు సహకారమందిస్తాడు. పెళ్లి నా కెరీర్పై ఎలాంటి ప్రభావం చూపదనుకుంటున్నా' అని సాక్షి తెలిపింది.
అయితే, తనకు కాబోయే భర్త పేరు మాత్రం 'సీక్రెట్' అని చెప్పేసింది. ఈ ఏడాది తాము పెళ్లి చేసుకుంటామని వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్లో పతకం సాధించాలన్న తన సన్నాహాలకు తన పెళ్లి ఏ మాత్రం అడ్డుకాబోదని స్పష్టం చేసింది.