ఆఫ్రిదీ బుద్ది వంకరే: మళ్లీ కాశ్మీర్పై వివాదాస్పదం
మొహాలీ: ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో వరుస అపజయాలతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ షాహిద్ ఆఫ్రిదీ తన బుద్ధి మార్చుకోలేదు. మరోసారి కాశ్మీర్పై వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరిగిన దాయాదుల సమరానికి కాశ్మీర్ నుంచి తమ మద్దతుదారులు తరలివచ్చారని చెప్పి విమర్శలపాలైన అఫ్రీది మరోసారి అలాంటి వ్యాఖ్యలు చేశాడు.
శుక్రవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్కు కాశ్మీర్ నుంచి వచ్చి తమకు మద్దతు తెలిపిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పి మళ్లీ వివాదాస్పదుడయ్యాడు. ‘పాకిస్థాన్, కాశ్మీర్ నుంచి వచ్చి మాకు మద్దతు తెలిపిన వారికి కృతజ్ఞతలు. అలాగే భారతలో మమ్మల్ని బాగా చూసుకున్న బీసీసీఐకి కూడా థ్యాంక్స్' అని ఆసీస్తో మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ వ్యాఖ్యానించాడు.
న్యూజిలాండ్తో గత మ్యాచ్లో టాస్కు ముందు కాశ్మీరీలకు థ్యాంక్స్ చెప్పి వివాదం సృష్టించాడు. దీన్ని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ తప్పుపట్టాడు. తమకు పాక్లో కంటే భారతలోనే ఎక్కువ ప్రేమ లభిస్తోందని టోర్నీ ఆరంభంలోనే అఫ్రీది వివాదం రేపిన సంగతి తె లిసిందే. అయితే తన వ్యాఖ్యలు విద్యావంతులను ఉద్దేశించినవేనంటూ విమర్శకులకు బదులిచ్చాడు.
నాలుగైదు రోజుల్లో రిటైర్మెంట్పై నిర్ణయం: అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడంపై స్వదేశానికి వెళ్లిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని అఫ్రీది స్పష్టం చేశాడు. తాను ఇప్పుడు ఒత్తిడిలో ఉన్నానని, అది మీడియాదే అని ఆయన వ్యాఖ్యానించాడు.
తన కుటుంబ సభ్యులతో పాటు వసీం అక్రమ్తో మాట్లాడిన తర్వాతే తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. దీనికి మరో నాలుగైదు రోజులు పట్టవచ్చునని అన్నాడు. "ఒక ప్లేయర్గా నేను ఫిట్. కానీ, కెప్టెన్గా ఫిట్గా లేను. అయితే కెప్టెన్సీని నేను ఆస్వాదించాన"ని అఫ్రీది చెప్పుకొచ్చాడు.
కొసమెరుపు ఏమిటంటే, రాజకీయాల్లోకి ప్రవేశించే ఉద్దేశంతోనే అఫ్రిదీ ఆ వ్యాఖ్యా చేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.