‘మా కోసమే కాశ్మీరీలు’: అఫ్రిదీ వివాదాస్పదం
మొహాలీ: భారతదేశంలోనే తమకు ఎక్కువ ప్రేమ లభిస్తుందనే వ్యాఖ్యలు చేసి స్వదేశం నుంచి విమర్శలు ఎదుుర్కొన్న పాకిస్థాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచ టీ20 టోర్నీలో భాగంగా పీసీఏ స్టేడియంలో న్యూజిలాండ్ జట్టుతో తాము తలపడుతున్న మ్యాచ్ను చూసేందుకు జమ్మూకాశ్మీర్ ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారని అన్నాడు.
టీమిండియా చేతిలో ఓటమి అనంతరం మంగళవారం (మార్చి 22న) న్యూజిలాండ్ జట్టుతో తలపడిన పాకిస్థాన్ జట్టు మరోసారి ఓటమి పాలైంది. దీంతో టీ20 ప్రపంచ కప్ టోర్నీ నుంచి దాదాపు నిష్ర్కమించినట్లే.
అంతకుముందు మొహాలిలో మంగళవారం న్యూజిలాండ్తో మ్యాచ్ సందర్భంగా టాస్ కోసం వచ్చిన అఫ్రిదిని చూసి జనాలు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. 'మీకు ఇక్కడ బాగానే అభిమానగణం ఉన్నట్లుందే' అని పాకిస్థాన్ మాజీ ఆటగాడైన వ్యాఖ్యాత రమీజ్ రాజా.. షాహిద్ను అడుగుతాడ.
దీనికి స్పందిస్తూ.. 'అవును మాకు చాలామంది అభిమానులున్నారు. కాశ్మీర్ నుంచి చాలామంది మాకోసం వచ్చారు' అని అఫ్రిదీ అన్నాడు. భారత్లో భాగమైన కాశ్మీర్ నుంచి.. పాక్ కోసం అభిమానులు వచ్చారనే అర్థంతో అఫ్రిది వ్యాఖ్యలు చేయడం వివాదానికి దారి తీసింది.
రిటైర్మెంట్పై అఫ్రిదీ
ఆస్ట్రేలియాతో శుక్రవారం జరగబోయే పోరే తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావొచ్చని.. న్యూజిలాండ్తో ఓటమి అనంతరం అఫ్రిదీ అన్నాడు. పాక్ సెమీస్ అవకాశాలు పూర్తిగా తెరపడకముందే అఫ్రిదీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రపంచకప్ అనంతరం అఫ్రిదీని కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నట్లు పీసీబీ ఇప్పటికే ప్రకటించింది.