ఏమిటీ వింత: ఇందిరా గాంధీపై సుజనా ప్రశంసలు
న్యూఢిల్లీ: మంత్రిగా ఉంటూ ప్రభుత్వాన్ని తప్పు పట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనా చౌదరి వింత వైఖరిపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. రాజ్యసభలో ఆయన ప్రత్యేక హోదాపై చర్చ సందర్భంగా పాలక బిజెపికి హెచ్చరికలాంటి సంకేతాలు పంపించారు. పైగా ఇందిరా గాంధీని ప్రశంసించారు.
కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి సుజనా చౌదరి (టిడిపి) మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని కొనియాడారు. వందేళ్ల వరకు రాష్ట్ర విభజన చేపట్టకూడదని స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు ససేమిరా అన్న ఇందిరా గాంధీ ఎంతో గొప్ప నాయకురాలని అన్నారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్తో పాటు బిజెపి కూడా సమాన బాధ్యత వహించాలని ఆయన అన్నారు.
ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగానికి పదేపదే అడ్డుపడ్డారు. రాష్ట్రాన్ని విభజించినందుకు కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయి మూల్యం చెల్లించుకుందని, బిజెపికి కూడా ఇదే గతి పడుతుందని ఆయన హెచ్చరించారు కూడా. విభజన చట్టంలో ఏపికి ఇచ్చిన హామీలతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆయన మోడీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నామే తప్ప బిచ్చమెత్తడం లేదని సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. దేశం గత 65 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పాలనలో కుళ్లిపోయిందని, ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశ పరిస్థితులను బాగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని సుజనా చౌదరి చెప్పారు.
సుజనా చౌదరి చేసిన ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, పార్టీ రాజ్యసభా పక్ష ఉపనాయకుడు ఆనంద్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్ కూడా సుజనా చౌదరి వ్యాఖ్యల పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక మంత్రి ఇలా మాట్లాడటం మంచిది కాదని హితవు చెప్పారు. జైట్లీ సమాధానం చెబుతున్నప్పుడు సుజనా చౌదరి పలుమార్లు అడ్డుపడటాన్ని కూడా కురియన్ తప్పుబట్టారు.