మీడియాకు టోకరా: సిఎంతో భేటీ, బ్యాక్ డోర్ నుంచి సూరీడు..
విజయవాడ: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి వ్యక్తిగత సహాయకుడు సూరీడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి కార్యాలయానికి రావడం హాట్ టాపిక్గా మారింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, వైఎస్ కుమారుడు జగన్కు చెందిన సాక్షి పత్రిక అమరావతి భూదందా గురించి వరుస కథనాలను ప్రచురిస్తున్న నేపథ్యంలో సూరీడు చంద్రబాబు కార్యాలయానికి వచ్చారు.
అయితే, మీడియాకు కనిపించుకుండా సూరీడు తిరిగి వెళ్లిపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు కార్యాలయం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు ప్రధాన ద్వారం నుంచి బయటకు రాకుండా మీడియా కళ్లు గప్పారు. సూరీడు కోసం మీడియా వేచి చూసింది.
అయితే, ఆ సమయంలో మంత్రులు పత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు నడుచుకుంటూ బయటకు వచ్చి మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడుతూ మెయిర్ గేటు వరకు వెళ్లారు. ఆ సమయంలో వెనక గేటు నుంచి సూరీడిని బయటకు పంపించారు.
మీడియాను పక్కదారి పట్టించేందుకే మంత్రులు బయటకు నడుచుకుంటూ వచ్చారని అంటున్నారు. సూరీడు చంద్రబాబుతో చాలాసేపు భేటీ అయినట్లు ప్రచారం సాగుతోంది. సిఎం కార్యదర్శి సతీష్ చంద్రను కూడా ఆయన కలిసినట్లు సమాచారం.
2009లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఇప్పటి వరకు సూరీడు ఎక్కడా కనిపించలేదు. ఇంత కాలానికి చంద్రబాబు కార్యాలయంలో ఆయన ప్రత్యక్షం కావడం ఉత్కంఠను రేపింది. జగన్ గుట్టు మట్లు తెలుసుకోవడానికి సూరీడిని చంద్రబాబు పిలిపించినట్లు చెబుతున్నారు.