కాలేజీ ఇలా, బోర్డ్ అలా: ప్రత్యూష పాసా? ఫెయిలా?
హైదరాబాద్: ప్రత్యూష.. సొంత తండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురై ఎన్జీఓ సంస్థలు, మీడియా, కోర్టుతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు చొరవతో నూతన జీవితాన్ని ప్రారంభించిన ఆమె అందరికీ తెలిసిన అమ్మాయే. అయితే, ఇటీవల ముగిసిన ఇంటర్ పరీక్షల ఫలితాలు ఆమెను అయోమయానికి గురిచేస్తున్నాయి.
ఈ ఏడాది ఇంటర్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరాలన్న ప్రత్యూష కోరిక తీరుతుందో లేదో అనే అనుమానం నెలకొంది. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులతో పాసైనప్పటికీ.. ఆమెకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన సెయింట్ డేనియల్ వొకేషనల్ కళాశాల ఆ వివరాలను సకాలంలో ఇంటర్బోర్డుకు పంపలేదు.
ఈ క్రమంలో ఇంటర్ ఫలితాల్లో ప్రత్యూష హాల్ టికెట్ నెంబర్ కొట్టి ఫలితాలు చూడగా ఫెయిలైనట్లు వచ్చింది. ఈ విషయమై ప్రత్యూషను ఓ మీడియా ఫోన్లో సంప్రదించగా, తాను ప్రాక్టికల్స్తో పాటు, అన్ని పరీక్షలు బాగా రాశానని తెలిపింది.
ఈ విషయమై డేనియల్ కళాశాల ప్రతినిధి విజయను ప్రశిస్తే.. ప్రత్యూషకు రెండు హాల్ టికెట్ నెంబర్లున్నాయని, ప్రాక్టికల్స్ తమ వద్ద, రాత పరీక్షలు నారాయణ కళాశాలలో రాసిందని పేర్కొన్నారు. తమ వద్ద నిర్వహించిన ప్రాక్టికల్స్లో పాసైందని, ఈ మార్కుల వివరాలు ఇంటర్ బోర్డుకు అందజేస్తామని ఆమె చెప్పారు. అయితే ఈ మార్కుల వివరాలను పరిగణలోకి తీసుకుని.. ఇంటర్ బోర్డు ప్రత్యూషను పాస్ చేస్తుందో లేదో వేచి చూడాలి.