నేతలపై కేసు పెడితే జైళ్లు సరిపోవు: తెలంగాణ మంత్రి
హైదరాబాద్: గత పదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ళ పేరిట జరిగిన అవినీతి వ్యవహారంలో ప్రజాప్రతినిధులపై కేసులు పెడితే రాష్ట్రంలోని జైళ్ళు సరిపోవని తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శాసన సభలో వ్యాఖ్యానించారు.
బడ్జెట్ పద్దులపై చర్చలో వివరణల సందర్భంగా సోమవారం.. విపక్ష సభ్యులు రెండు పడకగదుల ఇళ్ళ నిర్మాణంపై అనుమానాలు వ్యక్తం జేశారు. వాటికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. గతంలో మంజూరుచేసిన ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన బిల్లులను విడుదలచేయటం లేదని విమర్శించారు.
అనంతరం ఇంద్రకరణ్ మాట్లాడారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి 57వేల ఇళ్ళకు నిధుల్ని మంజూరు చేశామని, పూర్తయిన వారికే ఇస్తున్నామని, పునాదుల స్థాయిలో ఉన్నవాటికి ఇవ్వటం లేదన్నారు. ఆ ఇళ్ళలో అవినీతిపై సిబిసిఐడి విచారణ పూర్తి నివేదిక ఇంకా అందలేదన్నారు.
ఇప్పటికే ఈ వ్యవహారంలో అవకతవకలకు సంబంధించి 250 మంది అధికారులు సస్పెండయ్యారన్నారు. ప్రజాప్రతినిధులపైనా కేసులు పెడితే రాష్ట్రంలోని జైళ్ళు సరిపోవన్నారు. ఇళ్ళు కట్టకుండానే చాలాచోట్ల బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు.
మంత్రి హరీష్ రావు మాట్లాడాతూ... అధికారంలో ఉన్నప్పుడు ఇళ్ళ పేరిట పందికొక్కుల్లా బొక్కారని, ఇప్పుడు పారదర్శకంగా ఇళ్ళు కడతామంటే వాకౌట్లు చేస్తున్నారని, భిన్నధ్రువాలైన పార్టీలు కూడా కలసిపోతున్నాయని, ప్రజలకు తమపై నమ్మకం ఉందన్నారు.