తప్పుచేసేవారిని అడ్డుకోలేం, నేనింతే.. మారను: కోహ్లీ
బెంగళూరు: భారత్ టెస్ట్ కెప్టెన్, ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ సారథి విరాట్ కోహ్లీ మ్యాచ్ ఫిక్సింగ్ పైన స్పందించాడు. ఫిక్సింగ్ను అరికట్టేందుకు ఎంత కట్టుదిట్టమైనా విధానాన్ని అమలు చేసినా పక్కదారి పట్టేవాళ్లని అడ్డుకోవడం కష్టమని అభిప్రాయపడ్డాడు.
ఆటను స్వచ్ఛంగా ఉంచేందుకు అధికారులు చేయగలిగినంత చేస్తున్నారని చెప్పాడు. అయితే ఎంత చేసినా వ్యక్తుల గదుల్లోకి దూరి ఫలానా వారితో ఫలానా విధంగా మాట్లాడోద్దని మాత్రం చెప్పలేరు కదా అని వ్యాఖ్యానించాడు.
వారు ప్రొటోకాల్స్ అమలు చేయగలరని, నిబంధనలు పెట్టగలరని, అయితే చివరికి ఏ దారిలో వెళ్లాలన్నది నిర్ణయించుకోవాల్సింది వ్యక్తులేనని చెప్పాడు. తప్పు చేయాలని నిర్ణయించుకుంటే ఎంత నియంత్రించినా వారిని అడ్డుకోలేమని చెప్పాడు.
అలాంటి తప్పుడు వ్యవహారాలకు సంబంధించిన అనుభవాలు అదృష్టవశాత్తు జీవితంలో తనకు ఎప్పుడూ ఎదురుకాలేదని తెలిపాడు. తనకే అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదని, భవిష్యత్తులోను అలాంటి పరిస్థితులు ఎదురు కావనుకుంటున్నానని చెప్పాడు.
తాను అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడానికి దూకుడు ఉపకరిస్తుందని, ప్రపంచంలో దేని కోసమూ దూకుడు తత్వాన్ని మార్చుకోనని, ప్రతి క్రీడాకారుడికీ దూకుడు లేదా కసి ఉండాలని, కానీ అది సానుకూలంగా ఉండాలని, అహంకారపూరితంగా ఉండకూడదని చెప్పాడు.
ఓ క్రీడా దేశంగా మనకు సహనం లోపించిందని, ఇతరులపై చాలా త్వరగా ఒక అంచనాకు వస్తామని చెప్పాడు. మైదానంలో ఆడే ఆట ఆధారంగా ఓ ఆటగాడిపై అంచనాకు రావాలే కానీ అతడి వ్యక్తిగత జీవితం ఆధారంగా కాదని తెలిపాడు.