కట్జూకే చెల్లింది: జయలలితతో ప్రేమలో పడ్డాడట
న్యూఢిల్లీ: తన విభిన్నమైన ప్రకటనల ద్వారా ఎప్పుడూ వార్తల్లో ఉండే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మార్కండేయ కట్జూ తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు. తాను యవ్వనంలో ఉన్నప్పుడు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో ప్రేమలో పడినట్లు చెప్పారు.
ఇప్పటికీ జయలలిత ఆకర్షణీయంగానే కనిపిస్తుందని, ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. జయలలితను ఆయన ఆడసింహంగా అభివర్ణించారు. షేర్నీ ఔర్ షేర్ అంటూ ఫొటోలను ఫేస్బుక్కులో పోస్టు చేసి కట్జూ తన వ్యాఖ్యలను రాశారు.
జయలలిత ఆడ సింహం, ఆమె ప్రత్యర్థులు కోతులు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆమె కోలుకుని తిరిగి పనిలో పడుతారని ఆయన అన్నారు. తాను యవ్వనంలో ఉన్నప్పుడు, అదే సమయంలో జయలలిత యవ్వనంలో ఉన్నారని, ఆ కాలంలో తాను జయలలితతో ప్రేమలో పడ్డానని, ఈ విషయం జయలలితకు తెలియదని కట్జూ అన్నారు.
తనది అవ్యక్త ప్రేమ అని ఆయన చెప్పారు. ఇప్పటికీ జయలలిత ఆకర్షణీయంగానే కనిపిస్తారని, అయితే, దురదృష్టవశాత్తు తాను ఆకర్షణీయంగా లేనని, ఇప్పటికీ ఆమెను తాను ప్రేమిస్తున్నానని కట్జూ అన్నారు.