షాక్: రూ.318 కోట్లు వాషింగ్ మిషన్లో పోయాయి!
లండన్: ఓ మహిళ అనుకోకుండా తన లాటరీ టిక్కెట్ను వాషింగ్ మెషన్లో వేసింది. దీంతో ఆమె గెలుచుకున్న రూ.318 కోట్ల పదహారు లక్షల రూపాయలు ఆమెకు రాకుండా పోయాయి. ఈ ఘటన బ్రిటన్లో జరిగింది.
రూ.318 కోట్ల 16 లక్షల లాటరీను విజేతను ఇటీవల ప్రకటించారు. కానీ ఎవరూ టికెట్తో రాలేదు. ఆ భారీ మొత్తాన్ని ఎవరికీ ఇవ్వకుండా అలాగే ఉంచారు. అయితే, ఆ విజేతను తానే అని, ఆ టిక్కెట్ తాను తీసుకున్నదేనని ఓ మహిళ వచ్చింది.
అయితే, లాటరీ గెల్చుకున్న టికెట్ మాత్రం భద్రంగా లేదని చెప్పింది. అందుకు ఆమె తన వద్ద అంకెలు సరిగా కనిపించకుండా ఉన్న టిక్కెట్ను వారికి చూపించింది. టికెట్ దాచిన జీన్స్ ప్యాంటును వాషింగ్ మెషీన్లో వేసి ఉతకడంతో అంకెలు గుర్తు పట్టలేనంతగా నలిగిపోయాయని వాపోయింది.
ఆ విషయం విని ఇంగ్లండ్లోని ది నేషనల్ లాటరీ (కేమ్లాట్) నిర్వాహకులు అయోమయంలో పడ్డారు. ఈ సమస్యపై మాట్లాడుతూ... టికెట్ను వోర్సెస్టర్లో విక్రయించామని, ఎవరైనా ఈ బహుమతి గెల్చుకున్న టికెట్ కొన్నా, దాన్ని పోగొట్టుకున్నా, దొంగిలించినా, దుస్తుల్లో మర్చిపోయి ఉతికినా ఆ వివరాలు తెలియజేస్తూ ముప్ఫైరోజుల్లోగా తమ ముందుకు రావాలని ప్రకటించారు.