బాబుకు వైసిపి 'కొత్త' షాక్: 7సార్లు గెలిచినా ఇంతేనా!
హైదరాబాద్: తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, అభివృద్ధి గురించి, ప్రజలకు ఏం చేయాలో తనకు ప్రతిపక్షాలు చెప్పడం అవసరం లేదని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చెబుతుంటారు. దీనికి వైసిపి ఎమ్మెల్యే బుధవారం నాడు గట్టి కౌంటర్ ఇచ్చారు.
బుధవారం కూడా సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. తాను ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, ప్రజల కోసమే తెలుగుదేశం పార్టీ పుట్టిందని, మేం వారి కోసమే పని చేస్తామని, తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు అన్నీ తెలుసుకోవాలని చెప్పారు.
అయితే, వైసిపి యువ ఎమ్మెల్యే అనిల్ కుమార్... చంద్రబాబుకు ధీటుగా స్పందించారు. బుధవారం అసెంబ్లీ చివరి రోజు సమావేశాల్లో భాగంగా స్వచ్ఛ భారత్ కింద పాఠశాలల్లో మరుగు దొడ్లు, తాగునీటి సౌకర్యం ఏర్పాటుకు సంబంధించి పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి గంటా శ్రీనివాస రావు సమాధానం చెప్పారు.
ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ... చంద్రబాబు తనను కొత్త ఎమ్మెల్యే అంటూ సంబోధించారని, జాగ్రత్తగా మసలుకోవాలని సూచించారని గుర్తు చేశారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ... నేను మొదటిసారి ఎంపికయ్యానని, కానీ సీఎం చంద్రబాబు ఏడుసార్లు ఎన్నికైన కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికీ 65 శాతం పాఠశాలల్లో మంచినీరు కానీ, మరుగుదొడ్లు కానీ లేవని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తొలుత కుప్పంను ఆదర్శంగా అభివృద్ధి చేయాలని చురకలు అంటించారు.