‘సెల్ఫోన్ కొనివ్వట్లేదు! మా అమ్మను అరెస్ట్ చేయండి’
‘సెల్ఫోన్ కొనివ్వడంలేదు.. మా అమ్మను అరెస్టు చేయండి’ అంటూ ఓ ఏడో తరగతి చదువుతున్న బాలుడు పోలీసు స్టేషన్ మెట్లెక్కాడు.
చెన్నై: నేటి పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు సెల్ఫోన్లు లేకుండా బతకలేమనే పరిస్థితికి వచ్చారంటే అతిశయోక్తి కాదేమో. పొద్దున లేచినప్పటి నుంచి పడుకునే వరకు చాలా మంది సెల్ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తుండటం గమనార్హం. సెల్ఫీలు తీసుకుంటూ పలువురు ప్రాణాలు తీసుకుంటుంటే.. సెల్ఫోన్ల కోసం పలువురు తమ విచక్షణను కోల్పోతున్నారు.
తాజాగా తమిళనాడులో జరిగిన ఘటన అందర్నీ విస్తుపోయేలా చేసింది. 'సెల్ఫోన్ కొనివ్వడంలేదు.. మా అమ్మను అరెస్టు చేయండి' అంటూ ఓ ఏడో తరగతి చదువుతున్న బాలుడు పోలీసు స్టేషన్ మెట్లెక్కాడు.
వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తూత్తుకుడి ముత్తయ్యపురం ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న గణేశ్ ఆదివారం పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. బిగ్గరగా ఏడుస్తూ తన తల్లిని అరెస్టు చేయాలని పోలీసులను కోరాడు. అతడిని బుజ్జగించి ఎందుకని ప్రశ్నించగా.. సెల్ఫోన్ కొనివ్వడం లేదని చెప్పడంతో అవాక్కవడం పోలీసుల వంతైంది.
ఆ తర్వాత గణేశ్ తల్లిదండ్రులను రప్పించి మాట్లాడారు. పేదరికంతో ఉన్న తాము సెల్ఫోన్ కొనివ్వలేమని చెప్పినా.. అతడు పట్టువీడటం లేదని వారు తెలిపారు. ఆ బాలుడు ఉన్నట్టుండి తల్లిని అరెస్టు చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదరించడంతో పోలీసులు మరింత షాక్కు గురయ్యారు. చివరకు పోలీసులు తమదైన శైలిలో ఆ బాలుడికి సమాధానం చెప్పి తల్లిదండ్రులతో పంపించేశారు.