ఏడుస్తూనే ఉన్న శశికళ: వదిన మరణంతో తీవ్ర దు:ఖంలో!, బిగుస్తున్న ఉచ్చు..
తన అన్న భార్య, టీటీవి దినకరన్ కు అత్తగారైన సంతానలక్ష్మి ఈ నెల 26న మృతి చెందారు.
చెన్నై: అన్నాడీఎంకె తాత్కాళిక ప్రధాన కార్యదర్శి శశికళ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మన్నార్ గుడి మాఫియా తరహాలో జైల్లోను సకల సౌకర్యాలు అనుభవించడానికి జైలర్లను సైతం ఆమె తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.
సాక్షాత్తు జైళ్ల శాఖ డీఐజీ రూప ఈ ఆరోపణలు చేయడంతో.. శశికళ తీవ్ర ఇరకాటంలో పడ్డారు. దీనిపై ఘాటుగా స్పందించిన డీజీపీ సత్యనారాయణరావు.. అలాంటిదేమి లేదని, ఇలాంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పకపోతే రూ.50కోట్ల పరువునష్టం దావా వేస్తానని రూపకు నోటీసులు కూడా పంపించారు. ఆమెను ట్రాఫిక్ విభాగానికి బదిలీ కూడా చేశారు. దీంతో ఈ వ్యవహారం మరింత రక్తికట్టింది.
ఏసీబీకి న్యాయవాది ఫిర్యాదు:
డీజీపీ నోటీసులకు బెదిరేది లేదని, తాను కేసును ఎదుర్కొంటానని రూప సవాల్ చేశారు. కాగా, రూ.2కోట్లు ముడుపులు చెల్లించడం ద్వారా శశికళ జైల్లోను ప్రత్యేక సౌకర్యాలు పొందుతున్నారని రూప ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఆమెకు మద్దతుగా మరో న్యాయవాది కూడా అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ)కి ఫిర్యాదు చేశాడు.
Recommended Video
ఆధారాలున్నాయని:
బెంగుళూరుకు చెందిన నటరాజశర్మ అనే న్యాయవాది.. దీనిపై విచారణ జరపాల్సిందిగా ఏసీబీని కోరాడు. రూ.2కోట్ల ముడుపుల వ్యవహారంలో ప్రమేయం ఉన్న దినకరన్ తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన ప్రకాష్ అనే వ్యక్తిని కూడా విచారణ చేయాలని ఆయన కోరాడు. దినకరన్ స్నేహితుడు మల్లికార్జున్ కోరిక మేరకే ప్రకాష్ సహకరించినట్లు ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు.
అలాగే జైల్లో సేకరించిన ఆధారాలను డీఐజీ రూప.. తన ఉన్నతాధికారుల కన్నా ముందు మీడియాకు ఎందుకు బహిర్గతం చేయాల్సి వచ్చిందని కూడా ప్రశ్నించిన ఆయన.. దీనిపై కూడా విచారణ జరిపించాలని కోరారు.
వదిన మరణంతో కన్నీటిపర్యంతం:
అసలే వివాదాల మీద వివాదాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న శశికళను వదిన మరణం మరింత కలచివేసింది. తన అన్న భార్య, టీటీవి దినకరన్ కు అత్తగారైన సంతానలక్ష్మి ఈ నెల 26న మృతి చెందారు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెరోల్ కోసం శశికళ దరఖాస్తు చేసుకోగా.. అధికారులు అందుకు ఒప్పుకోలేదు.
చివరిసారిగా వదినను చూసుకోలేకపోయానన్న బాధతో శశికళ కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు. జైల్లో శశికళతో పాటు ఉన్న ఆమె మరో బంధువు ఇళవరసి ఆమెను ఓదారుస్తున్నట్లుగా చెబుతున్నారు.
రూప ఎఫెక్ట్:
రూప ఆరోపణల ఎఫెక్ట్ తో జైలు అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారు. బయటి నుంచి ఎలాంటి వస్తువులు శశికళకు అందకుండా జాగ్రత్తపడుతున్నారు. శివలింగానికి పూలు, పాలతో పూజ చేసే శశికళకు.. ప్రస్తుతం అవేవి అందించడం లేదు. దీంతో జైల్లోని నీళ్లతోనే జలాభిషేకం చేస్తూ దైవ ప్రార్థనలతో గడుపుతున్నారు.