'అమితాబ్-జయా బచ్చన్ మధ్య విభేదాలు.. విడివిడిగా ఉంటున్నారు..'
బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దంపతులపై రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమితాబ్, ఆయన భార్య జయాబచ్చన్ ఇద్దరు విడివిడిగా ఉంటున్నారంటూ అమర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దేశమంతటా హాట్ టాపిక్.
ముంబై: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ దంపతులపై రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమితాబ్, ఆయన భార్య జయాబచ్చన్ ఇద్దరు విడివిడిగా ఉంటున్నారంటూ అమర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దేశమంతటా హాట్ టాపిక్గా మారాయి.
ఇప్పటికే ఎస్పీలో(సమాజ్ వాదీ పార్టీ) ముసలానికి కారణమయ్యారంటూ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అమర్ సింగ్.. తాజా వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఏబీపీ మజ్హా అనే వార్తా సంస్థ అమర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా వెల్లడించింది.
ప్రతీ గొడవకు తనవైపే మీడియా వేలెత్తి చూపిస్తోందని చెప్పుకొచ్చిన అమర్ సింగ్.. అమితాబ్-జయాబచ్చన్ విషయాన్ని ప్రస్తావించారు.
'నేను అమితాబ్, జయాబచ్చన్ లను కలిసే నాటికి వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఒకరు ప్రతీక్షలో ఉంటే, మరొకరు జానక్ లో నివసిస్తున్నారు. జయ, ఐశ్వర్య మధ్య కూడా విభేదాలు వచ్చినట్టు ఊహాగానాలు వచ్చాయి. దీనికి నేను బాధ్యుడిని కాను' అంటూ తనపై వస్తోన్న విమర్శలకు పరోక్షంగా సమాధానం చెప్పారు.
కాగా, గతంలోను అమితాబ్ పై అమర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జయాబచ్చన్ ను ఎస్పీలో చేరవద్దంటూ అమితాబ్ హెచ్చరించారని గతంలో ఆయన వ్యాఖ్యానించారు. ఇకపోతే మొదట్లో అమితాబ్-అమర్ సింగ్ మధ్య కొన్నాళ్లపాటు స్నేహపూర్వక సంబంధాలు కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత అమితాబే అమర్ సింగ్ ను దూరం పెట్టారని చెబుతారు.
ఏదేమైనా అమర్ సింగ్ తాజా వ్యాఖ్యలపై అమితాబ్ కుటుంబం ఇప్పుడెలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.