చంద్రబాబు గుర్రు: అఖిలప్రియ మంత్రి పదవికి ఎసరు?
భూమా కుటుంబ వారసురాలు అఖిలప్రియకు మంత్రి పదవి మూణ్ణాళ్ల ముచ్చటేనని ఏపీలో అధికార టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఆ యువ మహిళా మంత్రికి పదవీ గండం పొంచి ఉన్నదనే వార్తలు ఏపీ టీడీపీ వర్గాల్లో గుప్పుమంటున్నాయి. ఆమె మంత్రిగా విధులను సక్రమంగా నిర్వహించట్లేదనే నెపంతో సీఎం చంద్రబాబు అఖిల ప్రియను మంత్రి బాధ్యతలనుంచి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం.
సమీక్షా సమావేశాల్లో ఆ యువ మంత్రి పనితీరుకు మైనస్ మార్కులు పడ్డాయని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుతున్నారు. విధుల నిర్వహణపై ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వినికిడి.
మంత్రి పెషీలో ఫైళ్లు కొండలా పేరుకుపోయాయని వినికిడి. అంతే కాదు సీఎం చంద్రబాబు నిత్యం నిర్వహించే సమీక్షల్లో ఆమె పనితీరు, ప్రతిభకు మైనస్ మార్కులు పడ్డాయని, దీంతో ఆయన మంత్రి అఖిలప్రియ పనితీరుపై సీరియస్ అయ్యారని తెలియవచ్చింది. అంతే కాదు మొక్కుబడిగా వివిధ సమీక్షా సమావేశాలకు హాజరవుతారన్న విమర్శను కూడా ఆమె ఎదుర్కొంటున్నారు.
మంత్రిగా బాధ్యతల నిర్వహణపై డోంట్ కేర్
అయితే కొత్త మోజు పాత బూజు అన్న చందంగా అఖిల ప్రియ పనితీరు ఉన్నదని టీడీపీ అధిస్టానంతో పాటు, సీనియర్ టీడీపీ నేతలు భావిస్తున్నారు. గత కొంత కాలంగా అఖిల ప్రియ బాధ్యతలను సరిగా పట్టించుకోవట్లేదనే వాదన వినిపిస్తోంది. మంత్రి కార్యాలయంలో ఫైళ్లు పెద్ద ఎత్తున పేరుకుపోయాయని వాటిని ఏమాత్రం పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్నారు. నెలల తరబడి నంద్యాల ఉపఎన్నికల ప్రచార, నిర్వహణ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారనుకుంటే, ఎన్నికలు అయిపోయి 45 రోజులవుతున్నా చేయాల్సిన పనులపై ఏమాత్రం దృష్టి పెట్టట్లేదని సమాచారం.
అఖిలను తప్పించేందుకు ఇలా యత్నాలు?
సీఎం చంద్రబాబు నిర్వహించే సమావేశాలకు అడపాదడపా హాజరవడం తప్పితే, శాఖాపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఇతర పనులను మంత్రిగా అఖిలప్రయి ఏమాత్రం పట్టించుకోవట్లేదని టీడీపీ వర్గాల్లో టాక్. అంతేకాదు పార్టీలో సీనియర్ నాయకులను సైతం ఏమాత్రం గౌరవించట్లేదని, మంత్రి పదవి చేపట్టాక జిల్లా సీనియర్ నాయకులను మర్యాద పూర్వకంగానైనా కలవకపోవడం పట్ల పార్టీ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ప్రారంభంలో ప్రసంశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం అఖిల ప్రియ తీరుపై కోపంగా ఉన్నారని సమాచారం. కాన్ఫరెన్స్ మీటింగులకు కూడా మొక్కుబడిగా హాజరవుతున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్షల్లోను మంత్రి పనితీరుకు మైనస్ మార్కులు పడ్డాయి. దీంతో అఖిల ప్రియను మంత్రి వర్గం నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు సైతం మొదలయ్యాయని పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
తమను అధినేత పట్టించుకోవడం లేదని అఖిలప్రియ ఆవేదన
కానీ మంత్రి అఖిల ప్రియ భవిష్యత్ విషయమై భూమా వర్గం వాదన మరోలా ఉంది. బెదిరించి, ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకున్న అధినేత తమను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఏ మాత్రం విలువ లేని శాఖను అఖిల ప్రియకు ఇచ్చారని విమర్శిస్తున్నారు. టీడీపీలో చేరేముందు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, ఆ అసంతృప్తితోనే అఖిల ప్రియ బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేకపోతోందని చెబుతున్నారు. ఏరు దాటాక తెప్ప తగలెస్తారా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇలా అఖిలప్రియకు చాన్స్
గతంలో పార్టీ మారిన భూమానాగిరెడ్డి మంత్రిపదవి రాకుండానే ప్రాణాలు కోల్పోయారు. దీంతో పార్టీలో చంద్రబాబు, టీడీపీపైపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అదే సమయంలో నంద్యాల ఉపఎన్నికల్లో గెలవడానికి భూమా నాగిరెడ్డి కుమార్తె భూమా అఖిల ప్రియకు మంత్రివర్గ విస్తరణలో పర్యాటక శాఖ కేటాయించారు. పదవి చేపట్టిన తొలినాళ్లలో శాఖా బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తున్నారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అఖిలప్రియను మెచ్చుకున్నారు.