బాబు ఆ లెక్క తేలిస్తేనే 'ప్యాకేజీ'?: విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి ఇలా..
కేంద్రం వైపు నుంచి వారి లెక్కలు క్లియర్ గానే ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు మాత్రం తేలాల్సి ఉంది.
న్యూఢిల్లీ: కేంద్రంతో సఖ్యతతో మెలిగితేనే రాష్ట్రానికి ప్రయోజనమంటూ ప్రత్యేక హోదాను సైతం టీడీపీ సర్కార్ త్యజించిన సంగతీ తెలిసిందే. హోదా స్థానంలో కేంద్రం ఇచ్చిన ప్యాకేజీయే ఏపీకి మోక్షం అన్న రీతిలో ప్రచారం చేసింది. మెల్లిమెల్లిగా హోదా అంశాన్ని కనుమరుగు చేస్తూ వచ్చింది.
హోదాను పక్కనపెట్టారు సరే, మరి ప్యాకేజీ అయిన ఎంతమేర అమలుకు నోచుకుంటుందో అన్నది చాలామందిని వెంటాడుతున్న ప్రశ్న. అటు కేంద్రం మాత్రం ఇప్పటిదాకా ఇచ్చిన నిధులకు లెక్క తేల్చండి.. ఆ తర్వాతే ప్యాకేజీ నిధులు ఇస్తామంటూ మెలిక పెట్టింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్ మేఘ్ వాల్ ఈవిధంగా బదులిచ్చారు.
అంతేకాదు, ఇప్పటివరకు ఏయే శాఖలకు ఎన్ని నిధులు ఇచ్చామన్నది లెక్కలతో సహా రాజ్యసభలో ఆయా శాఖల మంత్రులు వివరించారు. ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ. 3285.15 కోట్లు రాష్ట్రానికి మంజూరు చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి తెలిపారు.
విశాఖలో 50 పడకలతో సమగ్రమైన ఆయుష్ ఆస్పత్రి ఏర్పాటుకు గత ఏడాది బడ్జెట్లో కేంద్రం రూ.1కోటి విడుదల చేసినట్లు ఆయుర్వేద యోగ నేచురోపతి శాఖ సహాయమంత్రి శ్రీపాద యశ్సో నాయక్ పేర్కొన్నారు. అమరావతిలో రూ. 253.40కోట్ల అంచనా వ్యయంతో ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నిర్మాణం చేపట్టనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి హన్సరాజ్ తెలిపారు. ఇందులో కేంద్ర సహాయం రూ.152కోట్లు ఉంటుందని వివరించారు.
ఇలా కేంద్రం వైపు నుంచి వారి లెక్కలు క్లియర్ గానే ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు మాత్రం తేలాల్సి ఉంది. నిజానికి చాలారోజుల నుంచి కేంద్రం ఈ వాదన వినిపిస్తూనే ఉంది. ఇచ్చిన నిధులకు లెక్క తేలిస్తేనే.. ప్యాకేజీ విడుదల చేస్తామని కేంద్రం చెబుతూ వస్తోంది. మరి చంద్రబాబు సర్కార్ ఈ విషయంలో ఇప్పటికైనా స్పీడ్ పెంచుతుందో లేదో చూడాలి!.