మరికొద్ది గంటల్లో మూడో ప్రపంచయుద్ధం!: నివారణకు యాగం
ప్రఖ్యాత జ్యోతిష్కుడు ప్రమోద్ గౌతమ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. అతను యూపీ జ్యోతిష్కుడు. మరికొద్ది గంటల్లో ప్రపంచ వినాశనం మొదలు కానుందని, దీనిని నివారించేందుకు యాగం చేస్తున్నట్లు తెలిపారు.
ఆగ్రా: ప్రఖ్యాత జ్యోతిష్కుడు ప్రమోద్ గౌతమ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. అతను యూపీ జ్యోతిష్కుడు. మరికొద్ది గంటల్లో ప్రపంచ వినాశనం మొదలు కానుందని, మే 13 నుంచి మూడో ప్రపంచ యుద్ధం ఆరంభం కానుందని, కుజగ్రహ పీడితుడైన డొనాల్డ్ ట్రంప్ అమెరికాను కాపాడుకునే ప్రయత్నంలో అతి తీవ్ర చర్యలకు దిగుతారని, పశ్చిమం నుంచి తూర్పు దాకా భూగోళం కకావికలమవుతుందని చెప్పారు.
ఆయన చెప్పిన అంశం హాట్ టాపిక్ అయింది. గతంలో ట్రంప్ గెలుస్తాడని ప్రమోద్ చెప్పిన జోష్యం నిజమైన నేపథ్యంలో తాజాగా ఆయన చెప్పిన శకునాన్ని ప్రపంచ మీడియా హైలైట్ చేసింది.
యుద్ధ నివారణ కోసం ప్రమోద్ తన శిష్యులతో కలిసి ఆగ్రాలోని యమునా తీరంలో శుక్రవారం మహా శాంతి యజ్ఞం చేశారు. యమున సోదరుడు, మృత్యువుకు అధిపతి అయిన యమధర్మరాజును ప్రసన్నం చేసుకోవడం ద్వారా యుద్ధాన్ని నివారించే ప్రయత్నం చేశామని ప్రమోద్ మీడియాకు తెలిపారు.
ట్రంప్పై కుజ ప్రభావం
2017 మే 13 నుంచి సెప్టెంబర్ మాసాంతం వరకు ట్రంప్పై కుజుడు తీవ్ర ప్రభావం చూపుతాడని, ఈ సమయంలోనే అమెరికా తీవ్రహింసను ఎదుర్కోబోతుందని, ప్రతిచర్యగా ట్రంప్ తీసుకునే నిర్ణయాలతో మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుందని హెచ్చరించారు.
సంస్థ నడుపుతున్న ప్రమోద్
యూపీకి చెందిన జోతిష్యుడు ప్రమోద్ గౌతమ్ వేదిక్ సూత్రం అనే సంస్థను నడుపుతున్నారు. కొన్ని వార్తా సంస్థలు ఆయనను అమెరికన్ ఇండియన్గా పేర్కొన్నాయి. భవిష్యత్తును అంచనా వేయడంలో తాను ప్రవీణుడిని అని చెప్పుకుంటారు.
మోడీ, ట్రంప్ గెలుస్తారని ముందే చెప్పారు
ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ గెలుస్తారంటూ ఆయన ముందే చెప్పారు. అవి నిజమవడంతో ఆయన మాటలను కొందరు నమ్ముతారట. ట్రంప్ గెలుపు కోసం యజ్ఞం సైతం నిర్వహించిన అతను.. ఇప్పుడు ట్రంప్ వల్లే మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని, దానిని నివారించేందుకే శాంతి యజ్ఞం చేశానని చెప్పడం గమనార్హం.
భారత్ - పాక్ సంబంధాల పైనా..
మూడో ప్రపంచ యుద్ధంతోపాటు భారత్-పాకిస్థాన్ సంబంధాల పైనా ప్రమోద్ స్పందించారు. కాశ్మీర్ విషయంలో ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతాయని, అతి త్వరలోనే అవి ఉపద్రవానికి దారితీస్తాయని హెచ్చరించారు. కాగా, యమునా తీరంలో నిర్వహించిన శాంతి యజ్ఞంలో వివిధ సంస్థలకు చెందిన శాంతికాముకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.