82ఏళ్ల వయస్సులో తీహార్ జైలులోనే ఇంటర్ పూర్తి చేసిన మాజీ సీఎం!
ఆయనో మాజీ ముఖ్యమంత్రి, ఓ కేసులో దోషిగా తేలడంతో తీహార్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, అతను 82ఏళ్ల వయసులో శ్రద్ధగా చదువుకుని ఇంటర్మీడియట్ పూర్తి చేయడం విశేషం.
న్యూఢిల్లీ: ఆయనో మాజీ ముఖ్యమంత్రి, ఓ కేసులో దోషిగా తేలడంతో తీహార్ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే, అతను 82ఏళ్ల వయసులో శ్రద్ధగా చదువుకుని ఇంటర్మీడియట్ పూర్తి చేయడం విశేషం. చదువుకు వయస్సు గానీ, జైలుగోడలు కానీ అడ్డుకావని నిరూపించిన ఆ వ్యక్తే హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాష్ చౌతాలా.
టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్లో పదేళ్ల జైలు శిక్ష పడిన 82 ఏళ్ల చౌతాలా తాజాగా జైలులోనే హైయర్ సెకండరీ ఎగ్జామినేషన్ (12వ తరగతి)లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు. అంతేగాక, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు కూడా చేయాలనుకుంటున్నారు.
ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న ఆయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) నిర్వహించిన 12వ తరగతిలో ఫస్ట్క్లాస్ సాధించిన విషయాన్ని ఆయన చిన్న కుమారుడు, హర్యానా అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన అభయ్ సింగ్ చౌతాలా ధ్రువీకరించారు. ఏప్రిల్ 23న తన తండ్రి చివరి పరీక్ష రాశారని, ఆ టైమ్లో ఆయన పెరోల్లో ఉన్నప్పటికీ పరీక్షా కేంద్రం జైలు ఆవరణలోనే ఏర్పాటు చేయడంతో అక్కడకు వెళ్లి కింద కూర్చునే పరీక్ష రాశారని చెప్పారు.
శిక్షాకాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ తన తండ్రి ప్రతిరోజూ జైల్ లైబ్రరీకి వెళ్లడం, వార్తాపత్రికలు, పుస్తకాలు చదవడం చేసేవారని, తన ఫేవరెట్ పుస్తకాలు తెచ్చిపెట్టమని జైలు సిబ్బందిని కోరేవారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ రాజకీయ నేతల పుస్తకాలు సైతం చదువుతూ తమను కూడా పుస్తకాలు పంపమని కోరేవారని అభయ్ సింగ్ వెల్లడించాడు.
ఏప్రిల్ ద్వితీయార్థంలో తన మనుమడు దుష్యంత్ సింగ్ చౌతాలా పెళ్లికి హాజరయ్యేందుకు పెరోల్పై చౌతాలా విడుదలయ్యారు. మే 5వ తేదీతో ఆయన పెరోల్ ముగిసింది. కాగా, హర్యానాలో 2000లో 3,206 జూనియర్ బేసిక్ ట్రైన్డ్ టీచర్ల నియామకంలో అవినీతి చోటుకున్న ఆరోపణలు వచ్చాయి. ఈ స్కాంలో చౌతాలా, ఆయన కుమారుడు అజయ్ చౌతాలా, మరో 53 మందిని విచారణ కోర్టు 2013లో దోషులుగా నిర్ధారించింది. ఈ తీర్పును 2015లో సుప్రీంకోర్డు సమర్ధించడంతో ఆయనకు జైలు జీవితం తప్పలేదు.