దూకుడు తగ్గించి లౌక్యం పెంచిన అయ్యన్న: గంటాకు షాక్ల మీద షాక్లు!
మునుపటి దూకుడు తగ్గించిన అయ్యన్న.. ఇప్పుడు లౌక్యంగా గంటాను దెబ్బతీస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్: పరిస్థితులు అనకూలంగా లేనప్పుడు ప్రత్యర్థిని ఇరుకునపెట్టడానికి పరోక్ష వ్యాఖ్యలే తప్ప ప్రత్యక్షంగా నిందలేయలేని స్థితి వెంటాడుతుంది. ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడి తీరు కూడా ఇదే వ్యవహారాన్ని తలపిస్తోంది. నిన్న మొన్నటిదాకా విశాఖ భూఆక్రమణలపై గర్జించినంత పనిచేసిన ఆయన.. ఇప్పుడు మాత్రం కూల్ గానే స్పందిస్తున్నారు.
శుక్రవారం ఉదయం సిట్ బృందం చైర్మన్ వినీత్ బ్రిజ్లాల్ను కలిసి వినతిపత్రం అందజేసిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పరోక్షంగా మంత్రి గంటాను టార్గెట్ చేసినట్లుగా ఆ వ్యాఖ్యల్లో స్పష్టమైందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అప్పట్లో బయటపెట్టానని!
2014లో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విశాఖలో భూకుంభకోణం జరిగిందని, దీనిపై విచారణ కమిటీ వేయాలని అప్పట్లోనే తాను సీఎం సహా రెవెన్యూ మంత్రికి, జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశానని అయ్యన్న అన్నారు. ప్రభుత్వం ఎట్టకేలకు సిట్ తో దర్యాప్తు చేయిస్తుందన్నారు.
Recommended Video
పరోక్షంగా గంటాను టార్గెట్ చేసి!:
విశాఖపట్నంలోని ఇండియన్ బ్యాంకులో ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రూ.190 కోట్లు కొట్టేసిన ఘనులు ఉన్నారని, దీనిపై బ్యాంకు అధికారులు కూడా అంతర్గత విచారణ చేశారని, అన్నీ బయటకొస్తాయని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు పరోక్షంగా మంత్రి గంటాను టార్గెట్ చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతోంది.
గంటాపై ఆరోపణలు:
ప్రభుత్వ భూములను తనఖా పెట్టి రుణాలు ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా లిమిటెడ్ సంస్థ పేరు మీద రుణాలు పొందారన్న ఆరోపణలు మంత్రి గంటాపై చాలాకాలంగా ఉన్నాయి. దీనిపై హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. అయితే మంత్రి గంటా మాత్రం ప్రత్యూష కంపెనీ తీసుకున్న రుణానికి తాను హామీదారుడిని మాత్రమేనని, కంపెనీ రోజువారీ కార్యక్రమాల్లో ఎప్పుడూ భాగస్వామిగా లేనని చెబుతూ వస్తున్నారు.
దూకుడు తగ్గించిన అయ్యన్న:
కాగా, ఇంతకుముందు విశాఖ భూఆక్రమణల విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గని అయ్యన్న.. ఇప్పుడు మాత్రం లౌక్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థి పేరును పరోక్షంగా ప్రస్తావిస్తూనే.. తానెవరి మీద నిందలు వేయదలుచుకోలేదని శుక్రవారం సిట్ బృందాన్ని కలిసిన సందర్భంగా చెప్పారు. కుంభకోణంలో అన్ని పార్టీల నాయకులూ ఉన్నారంటూ తన అసలు ఉద్దేశాన్ని బయటపెట్టుకున్నారు.
మొత్తం మీద అయ్యన్న తీరు చూస్తుంటే గంటా శ్రీనివాసరావు గుండెల్లో ఆయన రైళ్లు పరిగెత్తించడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇప్పటికే దీనిపై సీఎంకు లేఖ రాసి మరీ అయ్యన్నపై అసహనం వెళ్లగక్కిన గంటాకు మున్ముందు మరిన్ని షాకులు తప్పేలా లేవనేది తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది.