నల్లారి కిశోర్ టీడీపీ చేరిక వెనుక: కిరణ్ ఇంట్లో పెద్ద చర్చే!, చాలానే జరిగింది..
విజయవాడ: రాష్ట్ర విభజన తర్వాత సమైక్యాంధ్ర పార్టీ పెట్టి.. ఆ తర్వాత కొద్దిరోజులకే దాన్ని పక్కన పెట్టేసిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం ఇప్పుడు టీడీపీ పక్షాన చేరిన సంగతి తెలిసిందే.
కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిపై ఇప్పటికీ స్పష్టత లేనప్పటికీ.. ఆయన సోదరుడు, పీలేరు అనుచరులు మాత్రం టీడీపీ గూటికి చేరిపోయారు. ఆ సమయంలో సీఎం చంద్రబాబు కిరణ్ ను ప్రశంసలతో ముంచెత్తి.. టీడీపీలోనే చేరాల్సిన అనివార్యతను కల్పించారు.
ఇదంతా పక్కనపెడితే.. నల్లారి కిశోర్ టీడీపీ చేరికకు ముందు పెద్ద తతంగమే నడిచిందన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇందుకోసం బెంగళూరు కేంద్రంగా చాలానే చర్చలు జరిపారట.
అమరనాథ్ రెడ్డి రాయబారం:
గత ఎన్నికల్లో పీలేరు నియోజకవర్గం నుంచి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పార్టీ గుర్తుపై పోటీ చేసి ఓడిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు ఆ కటుంబం దూరంగానే ఉంటోంది. ఇటీవల పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ కావడానికి కిశోర్ ప్రయత్నిస్తున్న తరుణంలో మంత్రి అమరనాథ్ రెడ్డి ఆయనను సంప్రదించినట్లు చెబుతున్నారు. టీడీపీలో చేరితే భవిష్యత్తుకు, పార్టీలో ప్రాధాన్యతకు ఢోకా ఉండదన్న ఆయన ప్రతిపాదన మేరకే కిశోర్ కుమార్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారని తెలుస్తోంది.
కిరణ్ కుమార్ రెడ్డితో చర్చలు:
పార్టీలో చేరాలని అమరనాథ్ రెడ్డి ఆహ్వానించిన సమయంలో.. అన్నయ్య కిరణ్ తో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కిశోర్ చెప్పినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బెంగళూరులోని కిరణ్ నివాసంలో కిశోర్, మంత్రి అమరనాథ్ రెడ్డి, మరో ఇద్దరు ప్రముఖులు సమావేశమై ఆయనతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కిరణ్ ముందు టీడీపీలో చేరిక ప్రతిపాదన ప్రస్తావించగా.. ఆయన మౌనంగానే ఉండిపోయారట. దీంతో టీడీపీలో చేరికపై ఆయనకు వ్యతిరేకత లేదన్న నిర్ణయానికి వారు వచ్చినట్లు సమాచారం.
టీడీపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్, పీలేరులో ఇలా..
కిశోర్ నిర్ణయంపై మౌనంగా కిరణ్
సమావేశం సందర్భంగా తన రాజకీయ భవిష్యత్తు గురించి ప్రస్తావిస్తూ.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారట. వెళ్తే.. మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లాలి, వైసీపీలో చేరే అవకాశమైతే లేదని ఆయన అనుచరుడు చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగుదేశంలో చేరికపై మౌనం దాల్చడంతో.. తాను మాత్రం టీడీపీలోనే చేరుతానని కిశోర్ కుమార్ రెడ్డి తేల్చి చెప్పారట. తమ్ముడి నిర్ణయంపై కిరణ్ వ్యతిరేకత వ్యక్తం చేయకపోవడంతో ఆయన చేరిక జరిగిపోయిందని చెబుతున్నారు.
జగన్ కంటే కిరణ్ రెడ్డి నయం, పదవి త్యాగం చేశారు, నాకూ రోషం ఉంది కానీ: బాబు షాకింగ్
బాబు వ్యూహాత్మకంగా?:
కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లో చర్చల సమయంలో.. టీడీపీలో చేరాలని అమరనాథ్ రెడ్డి ఆయన్ను పలుమార్లు అడిగినట్లు తెలుస్తోంది. పార్టీలోకి వస్తే గౌరవప్రదమైన స్థానం ఇస్తామని భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఆ సమయంలో కిరణ్ ఏమి స్పందించకపోయినా.. కిశోర్ చేరిక సమయంలో చంద్రబాబు ఆయనను పొగడటం చర్చనీయాంశంగా మారింది.
సమైక్యాంధ్ర కోసం కిరణ్ బాగా ప్రయత్నం చేశారనీ.. అధిష్టానాన్ని సైతం ఎదిరించారనీ ప్రశంసించి.. కిరణ్ టీడీపీలో చేరిక పట్ల చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎన్నికల నాటికి కిరణ్ నిర్ణయం ఎలా ఉండబోతుందన్నది తేలవచ్చు.