దాసరి మాటిచ్చారు.. జగన్ను సీఎం చేస్తానని: గుర్తు చేసుకున్న భూమన
వైసీపీలో చేరి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తానని దాసరి ఇటీవలే తమతో చెప్పారని భూమన గుర్తుచేసుకున్నారు.
హైదరాబాద్: దర్శకరత్న దాసరి నారాయణరావు మరణం సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయ రంగ ప్రముఖులను విషాదంలో ముంచెత్తింది. దాసరితో ప్రత్యక్షంగా,పరోక్షంగా అనుబంధం ఉన్న వ్యక్తులంతా ఆయన అంత్యక్రియలకు బయలుదేరారు. వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా దాసరి అంత్యక్రియల్లో పాల్గొంటున్నారు.
కాగా, గత కొన్నాళ్లుగా వైసీపీ అధినేత జగన్, దాసరిల మధ్య సాన్నిహిత్యం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జగన్ తన కొడుకు లాంటి వాడని దాసరి పలుమార్లు చెప్పుకొచ్చారు కూడా. ఈ నేపథ్యంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి దాసరితో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వైసీపీలో చేరి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేస్తానని దాసరి ఇటీవలే తమతో చెప్పారని భూమన గుర్తుచేసుకున్నారు.
బుధవారం ఉదయం ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన సందర్భంగా భూమన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. సినీ పరిశ్రమ పెద్ద దిక్కును కోల్పోయిందని చెప్పారు. సినీ పరిశ్రమలో దాసరి మహా వృక్షం లాంటి వారని, ఆయన ఆశ్రయంలో ఎంతోమంది కళాకారులు పైకి వచ్చారని గుర్తు చేశారు.ఆయన మరణం తీరని లోటు అని ఆవేదన చెందారు.