ఇదీ వాస్తవం: పీకల్లోతు అప్పుల్లో ఏపీ రైతులు, 'ఎకనమిక్ సర్వే' తేల్చి చెప్పింది..
రైతుల విషయంలోనే కాదు.. రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి రేటు కూడా తిరోగమనంలోనే ఉందని సర్వేలో తేలడం గమనార్హం.
అమరావతి: సంక్షేమం విషయంలో రాష్ట్రాన్ని అన్నివిధాలుగా ముందుకు తీసుకెళ్తున్నామని చెబుతున్న చంద్రబాబు సర్కార్ మాటల్లో డొల్లతనాన్ని కేంద్ర ఆర్థిక సర్వే బయటపెట్టింది. ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేదని, రాష్ట్రంలో రైతుల పరిస్థితే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం హామి ఇచ్చిన రుణమాఫీ లబ్దిదారులకు చేరలేదని, అదంతా వట్టి డొల్లే అని ఈ సర్వేతో తేలిపోయింది. రాష్ట్రంలో దాదాపు 50శాతం మంది రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని, సన్న, చిన్నకారు రైతుల పేరునే కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది.
ఇదీ వాస్తవం:
బ్యాంకుల నుంచి వీరికి రుణాలు అందకపోవడం వల్లే రైతులంతా ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని, దీంతో వడ్డీల భారం పెరిగిపోతోందని పేర్కొంది. రైతులకు అవసరమైన పంట రుణాల్లో సగంలో సగం కూడా బ్యాంకులు, సహకార సంఘాల నుంచి అందడం లేదని వాస్తవ పరిస్థితిని చెప్పుకొచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రైతులపై ఉన్న రుణభారాన్ని కేంద్ర ఆర్థిక సర్వే తమ తాజా నివేదికలో పేర్కొంది. త్వరలోనే దాన్ని పార్లమెంటుకు అందించనుంది.
ఏపీ రైతులపై రూ.32, 277కోట్ల రుణ భారం:
2016-17సంవత్సరంలో రాష్ట్రంలోని రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి రూ.32, 277కోట్లను రుణంగా పొందారని కేంద్ర ఆర్థిక సర్వే తెలిపింది. ఇందులో చిన్న, సన్నకారు రైతుల రుణభారమే రూ.25,872కోట్లు ఉందని తేల్చింది.
సెంటు భూమి కూడా లేని లేదా 2.5హెక్టార్లలో లోపు భూమి ఉన్న రైతులను సన్న, చిన్నకారు రైతులుగా.. 2.5హెక్టార్ల పైబడి 5.5హెక్టార్లలో లోపు ఉన్న రైతులను సన్న, చిన్న కారు రైతులుగా, 2.5 హెక్టార్ల పైబడి 5.5 హెక్టార్ల లోపు భూమి ఉన్న రైతులను మధ్యతరగతి రైతులుగా, 5.5 హెక్టార్ల కన్నా పైబడిన రైతులను పెద్ద రైతులుగా పరిగణిస్తూ ఈ సర్వే చేపట్టారు.
తిరోగమనంలో రాష్ట్రం:
ఒక్క రైతుల విషయంలోనే కాదు.. రాష్ట్ర తలసరి ఆదాయం వృద్ధి రేటు కూడా తిరోగమనంలోనే ఉందని సర్వేలో తేలడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం వృద్ధిలో, స్థూల ఉత్పత్తి పెరుగుదలలో రాష్ట్రం తిరోగమనంలో ఉన్నట్లు తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ తో పాటు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని రైతులు కూడా ఎక్కువగా ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచే రుణాలు పొందుతున్నారని సర్వే తెలిపింది. కేరళలో ఎక్కువ మంది రైతులు అప్పుల ఊబిలో ఉన్నట్లు పేర్కొంది.
రుణమాఫీ ఏమైనట్లు?:
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రైతు రుణమాఫీ హామిపై రైతులు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఐదు దఫాలుగా రుణమాఫీ పూర్తవుతుందని ప్రభుత్వం చెప్పినప్పటికీ.. ఇప్పటివరకు మూడవ విడత డబ్బులు కూడా రాలేదని కొంతమంది రైతులు వాపోతున్నారు.
పైగా అప్పుడేమో సంపూర్ణ రుణమాఫీ అని చెప్పి ఇప్పుడు మాత్రం లేని కండిషన్స్ పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. టీడీపీ సర్కార్ కు ఇంకా రెండేళ్ల కాలపరిమితే ఉండటం.. ఈలోగా దాదాపు 13వేల కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి రావడం.. దాని సాధ్యాసాధ్యాలపై అనుమానాలు వ్యక్తమయేలా చేస్తున్నాయి.