నంద్యాలపై చంద్రబాబు డైలమా: జగన్ సహకారమా...
నంద్యాల ఉప ఎన్నిక టికెట్ అఖిల ప్రియ కటుంబ సభ్యులకు ఇచ్చి జగన్ సహకారం తీసుకోవడమా, శిల్పాకు ఇచ్చి పోటీని ఎదుర్కోవడమా అనేది చంద్రబాబు డైలమా....
విజయవాడ: భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల శాసనసభ ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు ఇంకా డైలమాలోనే ఉన్నారు.
సంప్రదాయం ప్రకారం భూమా నాగిరెడ్డి కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, నంద్యాల టికెట్ తనకే ఇవ్వాలంటూ పార్టీ నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి పట్టుపడుతున్నారు. ఇరు వర్గాలతోనూ చంద్రబాబు ఎడతెరిపి లేని చర్చలు సాగిస్తూనే ఉన్నారు.
తుది నిర్ణయం చంద్రబాబుది అంటూనే ఇరు వర్గాలు కూడా నంద్యాల టికెట్ను దక్కించుకోవాలని చూస్తున్నారు. తమ కటుంబ సభ్యులకు ఇస్తే ఏకగ్రీవం చేసుకుంటామని మంత్రి అఖిల ప్రియ వర్గీయులు వాదిస్తుండగా, ఇచ్చిన మాట ప్రకారం తనకు టికెట్ ఇవ్వాలని శిల్పా మోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు. ఈ స్థితిలో నంద్యాల టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంపై పీట ముడి పడింది.
అమెరికా నుంచి వచ్చిన తర్వాతనే...
ఇరు వర్గాలు తమ తమ పట్టును వీడికపోవడంతో నిర్ణయాన్ని చంద్రాబబు వాయిదా వేస్తూ వస్తున్నారు. ఇరు వర్గాలు ఆదివారం చంద్రబాబును కలిసి తమ తమ వాదనలు వినిపించాయి. తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటన తర్వాత నంద్యాల టిడిపి అభ్యర్థి ఎవరనేది ఖరారు చేస్తారనే మాట వినిపిస్తోంది. అయితే, నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థిని ఖరారు చేయాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
రాజకీయంగా దెబ్బ తింటానని...
తనకు సీటు ఇవ్వకపోతే రాజకీయంగా దెబ్బతింటానని, ఇన్నేళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన తన వర్గం చెల్లాచెదురవుతందని, తన ఇమేజ్ పోతుందని శిల్పా మోహన్ రెడ్డి చంద్రబాబుకు చెప్పారు. గత ఎన్నికల్లో కూడా తానే పోటీ చేసినందున ఈసారి కూడా తనకే టికెట్ ఇవ్వడం భావ్యమని, ఏ విషయం త్వరగా తేలిస్తే కేడర్లో గందరగోళం ఉండదని ఆయన చంద్రబాబుతో అన్నట్లు సమాచారం.
మాకు జగన్ సహకారం...
శిల్పా మోహన్ రెడ్డి భేటీ తర్వాత భూమాకు ఆప్తుడైన ఎవి సుబ్బారెడ్డి కూడా చంద్రబాబును కలిశారు. భూమా కుటుంబానికి టికెటిస్తే దాదాపు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉందని ఆయన చంద్రబాబుతో చెప్పినట్లు సమాచారం. ఇందుకు గాను జగన్ నాయకత్వంలోని నేతలతో చర్చలు జరుగుతున్నాయని, పైగా నంద్యాలలో ఇప్పుడు ఆ పార్టీకి సరైన అభ్యర్థి కూడా ఎవరూ లేరని ఆయన చెప్పినట్టు సమాచారం.
ఇద్దరూ కలిసే ఉండండి...
ఇరువురి వాదనలు విన్న చంద్రబాబు తాను అమెరికా నుంచి వచ్చిన తర్వాత అభ్యర్థిని ఖరారు చేద్దామని, అయితే సీటు ఎవరికి ఇచ్చినా మరొకరు అభ్యర్థి విజయం కోసం పనిచేయాలని సూచించారు. అందుకు ఇద్దరూ అంగీకరించినట్లు చెబుతున్నారు. అయితే, అఖిలప్రియ కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే శిల్పా మోహన్ రెడ్డి పార్టీలో ఉంటారా అనేది అనుమానంగా ఉంది. ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధపడినట్లు ప్రచారం సాగుతోంది. దీనివల్లనే చంద్రబాబు అఖిలప్రియ కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు మీనమేషాలు లెకిస్తున్నట్లు చెబుతున్నారు.
శిల్పా మోహన్ రెడ్డి ఇలా..
చంద్రబాబుతో భేటీ తర్వాత శిల్పా మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ చర్చలు అర్థవంతంగానే జరిగాయని, చంద్రబాబు అన్నీ విన్నారని చెప్పారు. గత ఎన్నికల్లో తానే పోటీ చేసినందున మళ్లీ తనకే టికెట్ ఇవ్వాలని కోరారని, అయితే భూమా వాళ్లు కూడా అడుగుతున్నారని చెప్పారు. టికెట్ ఎవరికి ఇచ్చినా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. ఆయన పార్టీలో ఉన్నా అఖిల ప్రియ వర్గానికి మద్దతు ఇస్తారా అనేది కూడా అనుమానంగానే ఉందని అంటున్నారు.