ఇంత నిర్లక్ష్యమా?: గంటాపై చంద్రబాబు సీరియస్, హెచ్చరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు మూడురోజుల పాటు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసిన ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాల వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి గంటాతోపాటు ఇద్దరు ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరిపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.
రోడ్డెక్కడంతో..
గత మూడురోజుల నుంచి ఉపాధ్యాయులు కీలకమైన డిమాండ్లతో రోడ్డెక్కడంతో ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. దీనిపై చంద్రబాబునాయుడు గత మూడురోజుల నుంచీ సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు.
బాబు ఆదేశాలపై గంటా నిర్లక్ష్యం..
ఉపాధ్యాయుల డిమాండ్లపై చర్చించి, వాటి వివరాలను ఎప్పటికప్పుడు మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించాలని చంద్రబాబునాయుడు మూడురోజులుగా గంటాకు ఇచ్చిన ఆదేశాలను ఆయన పట్టించుకోలేదని తెలిసింది., దీంతో ప్రభుత్వ వైఖరితో విసిగిపోయిన ఉపాధ్యాయ సంఘాలు చలో సచివాలయానికి పిలుపు ఇచ్చారు.
బాబు అసహనం
మూడురోజుల నుంచి ఆ అంశం వివాదంగా మారి, మీడియాలో చర్చనీయాంశమయినప్పటికీ అటు మంత్రి గానీ, ఇటు కార్యదర్శి-కమిషనర్ గానీ ఎవరూ స్పందించకపోవడం ముఖ్యమంత్రి ఆగ్రహానికి కారణమైంది. చివరకు ఒక దశలో ఇదే అంశంపై నిర్వహించిన సమావేశానికి, సీఎంఓ అధికారులు కూడా అందుబాటులో లేకుండా పోవడంపై బాబు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
గంటాకు బాబు సూచన
ప్రతిభ ఆధారంగా మార్కులు, వెబ్కౌన్సిల్, రేషనలైజేషన్ వద్దని సంఘాలు చేస్తున్న రెండు ప్రధాన డిమాండ్లపై అప్పుడే చర్చించి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదంటున్నారు. చివరకు సమస్య ముదురుపాకాన పడి, టీచర్ల సంఘాలు జిల్లాల్లో డిఈఓ కార్యాలయాల ముట్టడి నిర్వహించి, చలో సచివాలయం నిర్వహించేందుకు పిలుపునివ్వడంతో అప్రమత్తమైన బాబు, తన తిరుపతి పర్యటనకు ముందు ఎయిర్పోర్టుకు వెళుతూ మంత్రి గంటా శ్రీనివాస్తో ఫోన్లో మాట్లాడి, దీనిపై దృష్టి సారించాలని ఆదేశించారు.
మంత్రి, అధికారుల నిర్లక్ష్యంతో పార్టీలో ఆందోళన
మూడురోజుల నుంచి జరుగుతున్న ఆందోళనను మంత్రి, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రభుత్వం ఆందోళనకు గురికావలసి వచ్చిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. విద్యాశాఖలో మంత్రి-ఉన్నతాధికారుల మధ్య బేధాభిప్రాయాలుండటమే టీచర్ల సమస్య మూడురోజుల పాటు నానడానికి అసలు కారణమని అధికార వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మంత్రులకు, అధికారులకు ప్రభుత్వానికి మైలేజీ తీసుకురావాలన్న ఆలోచన లేకపోవడమే సమస్యలకు కారణమవుతోందని పార్టీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
గంటాను హెచ్చరించిన బాబు
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన సీఎం చంద్రబాబుచివరిగా గంటాను హెచ్చరించారు. దీంతో గంటా గురువారం రాత్రి 10న్నర నుంచి అందుబాటులో ఉన్న ఉపాధ్యాయ సంఘాల నేతలను చర్చలకు పిలిపించాల్సి వచ్చిందని అధికార వర్గాలు చెప్పాయి. అదేదో ముందుగానే స్పందించి ఉంటే ఇన్ని సమస్యలు వచ్చేవి కాదని అంటున్నాయి. సీఎం ఆగ్రహానికి కూడా గురికావాల్సి వచ్చేది కాదని చెబుతున్నాయి.